త్వరగా స్పందించారు: చంద్రబాబుకు తమిళ మీడియా ప్రశంసలు
చెన్నై/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తమిళ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. ప్రకృతి విపత్తుల సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై తమిళ పత్రికలు జూనియర్ వికటన్, నక్కీరన్ పత్రికలు ప్రశంసల జల్లు కురిపించాయి.
హుధుద్ తుఫాను సమయంలో బస్సులో బసచేసి సహాయ చర్యలు చేపట్టారని జూనియర్ వికటన్ పేర్కొంది. కాగా, ప్రజలకు అండగా నిలిచి.. అధికారులను హెచ్చరించిన సీఎం పేరుతో నక్కీరన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. నడుంలోతు నీళ్లలో దిగి సహాయ చర్యలు పర్యవేక్షించారని చంద్రబాబును ఆ పత్రికలు కొనియాడాయి.
ఇటీవల భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమైన విషయం తెలిసిందే. అక్కడ సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళ పత్రికలు చంద్రబాబును ప్రశంసిస్తూ కథనాలు రాయడం గమనార్హం. కాగా, తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రూ. 10కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసందే.
ఐటి సంస్థల ఆర్థిక సాయం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నై సహా పలు ప్రాంతాలు అతలాకుతలమైన నేపథ్యంలో ఐటీ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలు తమిళనాడుకి ఆర్థిక సహాయాన్ని అందించాయి.
ఇన్ఫోసిస్ రూ.10కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించగా, కాగ్నిజెంట్ రూ.6.50కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రానికి ఆర్థిక సహాయంగా సీఎం సహాయనిధికి రూ.130కోట్లు వచ్చి చేరినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.