తమిళనాడు అసెంబ్లీలో వినిపించిన పవన్ కళ్యాణ్ ప్రశంసలు: బండ్ల గణేష్ ఆనందం
చెన్నై: ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్పై ప్రశంసలు కురిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏకంగా తమిళనాడు అసెంబ్లీలోనే ప్రస్తావనకు రావడం ఆ వ్యాఖ్యలకు మరింతగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రశంసలు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరును ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ తోపాటు ప్రముఖ నటుడు చిరంజీవి, స్టాలిన్ భేటీపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారరు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ను తమిళనాడు మంత్రి తెలుగులోనే చదివి వినిపించడం గమనార్హం. ఆ తర్వాత సీఎం తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి సుబ్రమణియన్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
బండ్ల గణేష్ ఆనందం..
పవన్ ట్వీట్ను తోటి శాసనసభ్యులకు అర్థమయ్యేలా తెలుగులో చదువుతూ తమిళంలో కి అనువాదించి చెప్పారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ప్రముఖ సినీ నిర్మాత, పవన్ కళ్యాణ్ వీరాభిమాని, ఒకరంగా చెప్పాలంటే భక్తుడు బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి ఆనందం వ్యక్తం చేశారు.
సీఎం స్టాలిన్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
కాగా, ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ' ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయాలు చేయాలి. కానీ, అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు(స్టాలిన్) మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేయాస్తున్నాను' అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎం పార్టీలు కలిసి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే అధినేత స్టాలిన్పై పవన్ ప్రశంసలు రాజకీయ చర్చకు దారితీశాయి. కాగా, యోగి ఆదిత్యనాథ్ కూడా 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ ఫొటోతో ముద్రితమైన బ్యాగులు, ఇతర వస్తువులనే విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. ప్రజాధనం వృథా చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
సీఎంని కలిసి అభినందించిన చిరంజీవి
ఇది ఇలావుంటే, గత బుధవారం ప్రముఖ నటుడు, పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవి.. తమిళనాడు సీఎం స్టాలిన్తో భేటీ అయ్యారు. చెన్నైలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్టాలిన్ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తీసుకున్న పలు నిర్ణయాలతో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగారని వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో మెరుగైన పాలన అందిస్తున్నారని సీఎంకు అభినందనలు తెలియజేసినట్లు చిరంజీవి ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు. కాగా, మెగా సోదరులిద్దరూ తమిళనాడు సీఎంపై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాజకీయాల్లోనూ మెగా బ్రదర్స్ ప్రశంసలు చర్చనీయాంశంగా మారాయి.