దుర్గ గుడిలో భైరవీ పూజ: తమిళ తాంత్రికులతో ఇలా...
Recommended Video
విజయవాడ: బెజవాడ కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆలయ ముఖ్య అధికారి ఒకరు దానికి నడుం కట్టినట్లు తెలుస్తోంది.
కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు నిజమేనట...మాటమార్చిన ఈవో...సంచలనం
భైరవీ పూజ చేస్తే మరింత శక్తి వస్తుందని, కష్టాలు తొలుగుతాయని ఓ అర్చకుడు ముఖ్య అదికారికి చెప్పారని సమాచారం. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి. దానికి ముఖ్య అధికారి తల ఊపి తమిళనాడు నుంచి తాంత్రికులను పిలిపించినట్లు తెలుస్తోంది.
ఆ రోజు ఇలా చేశారట..
మీడియా కథనాల ప్రకారం- డిసెంబరు 26వ తేదీ రాత్రి 9 గంటలకు గట్టువెనుక నివాసం ఉంటున్న ఆలయ అర్చకుడి ఇంటికి ఆ అధికారి వెళ్లారు. ఆలయంలో భైరవీ పూజను ఎలా పూర్తి చేయాలనే విషయంపై వారిద్దరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తంతుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు.
తాంత్రికులు ఇలా వచ్చారు.
తమిళనాడు నుంచి వచ్చిన నలుగురు తాంత్రికులతోపాటు దుర్గమ్మ ఆలయంలో పూజలు చేసే తండ్రీ కొడుకులు గుడిలోకి చేరుకున్నారని సమాచారం. అమ్మవారికి పవళింపు సేవ ముగిసిన తర్వాత మూసివేసిన గర్భగుడి తలుపులను తెరిచారని, రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 12.45 గంటల వరకు అత్యంత రహస్యంగా భైరవీ పూజ నిర్వహించారని అంటున్నారు. తంతు ముగిసిన తర్వాత గుడి తలుపులు మూసి వెళ్లిపోయారని సమాచారం.
ఇంద్ర కీలాద్రీపై కొలువైన..
ఆంధ్రజ్యోతి మీడియా కథనం ప్రకారం - ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారికి శైలిపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాలరాత్రి, భైరవీ, సర్వసిద్ధి అనే తొమ్మిది పేర్లు ఉన్నాయి. ఈ పేర్లతో వామాచార విధానంలో అమ్మ వారికి పూజలు జరిగేవి. వామాచారమంటే జంతు బలుల వంటి తాంత్రిక విధానాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల అమ్మవారు భీకర స్వరూపిణిగా ఉంటారనే ఉద్దేశంతో, ఆదిశంకరాచార్యుల వారు ఆ పేర్లను మార్చి వేసి, అమ్మవారికి లలితా రూపాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ సాత్విక పూజలు జరుగుతున్నాయని అంటారు.
అర్చకుడి సలహా మేరకు ఇలా..
ఒక అర్చకుడు ఇచ్చిన సలహా మేరకు ఆ ముఖ్య అధికారి తన స్వప్రయోజనం కోసం భైరవీ పూజ చేయించారంటూ మర్నాడే ప్రచారం జరిగింది.ఆలయ పాలకవర్గం సభ్యులు దీనిపై కార్యనిర్వహణాధికారి సూర్యకుమారిని ప్రశ్నించారు. అలాంటిదేమీ జరగలేదని ఆమె జవాబిచ్చారు. ఆ తరువాత సీసీ టీవీ ఫుటేజీలో, అంతరాలయం ముందు దుర్గగుడితో సంబంధంలేని వ్యక్తులు కాషాయ వస్త్రాలతో కనిపించడంతో వివాదం ముదిరింది.
మంత్రి మాణిక్యాలరావు ఇలా చెప్పారు.
ఈవో సూర్యకుమారితో దుర్గగుడిలో పూజల వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ఫోన్లో మాట్లాడారు. భద్రీనాథ్తో వచ్చిన వ్యక్తిని కృష్ణాజిల్లా విశ్వనాథపల్లి ఆలయ అర్చకుడు రాజాగా గుర్తించామని ఆయన చెప్పారు. అయితే రాజాను గుడిలోకి తీసుకువెళ్లడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. అమ్మవారికి అలంకరణ చేసే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న భద్రీనాథ్కు చార్జ్మెమో ఇచ్చారు.
ఏలాంటి పూజలూ జరగలేదని మంత్రి
దుర్గగుడి ఆలయంలోని గర్భాలయంలోకి ఇతరులు వెళ్లడం నిషిద్ధమని, కేవలం గర్భాలయ ప్రవేశం ఉన్న అర్చకులకు మాత్రమే ఆ అనుమతి ఉందని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. వేరే దేవాలయ అర్చకుడు గర్భాలయంలోకి ప్రవేశించింది నిజమేనని, చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. క దుర్గగుడిలో ఎలాంటి పూజలు జరగలేదని, అలంకరణ ప్రక్రియ మాత్రమే జరిగిందని మంత్రి మాణిక్యాలరావు వివరించారు.