సెల్ఫీ వీడియో తీసి, తిరుపతిలో యువ దంపతుల ఆత్మహత్య
చిత్తూరు: ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో కలకలం రేపింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యువ దంపతులు తిరుమలలో పుణ్య క్షేత్రానికి వచ్చి అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న దంపతులను సంపత్ కుమార్, సత్యవాణిలుగా గుర్తించారు. అక్కడి ఓ అతిథి గృహంలో గదిని అద్దెకు తీసుకున్న దంపతులు.. ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
వారు చనిపోయే ముందు ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ తమను తాము వీడియో (సెల్ఫీ వీడియో) తీసుకున్నారు. చనిపోయే ముందు సెల్ఫీలు కూడా దిగారు. టిటిడి సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
టిటిడి ఉద్యోగుల నివాసాల్లో సోదాలు
టిటిడి ఉద్యోగుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సూపరింటెండెంట్లు నరేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కళ్యాణ కట్ట ఉద్యోగి తంగవేలు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా ఏం స్వాధీనం చేసుకున్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.
ట్యాంకర్ల ద్వారా నీరు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా తెలంగాణకు నీటి తరలిస్తున్నారు. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గిద్దలూరులో తీవ్ర నీటి ఎద్దటి నెలకొంది. మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని తరలించడం ఏమిటని మండిపడుతున్నారు.