కాంగ్రెస్తో పొత్తంటే తెగతెంపులే: తమ్మినేని, కారుకు ఓకె
హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే తెగతెంపులే ఉంటాయని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మంగళవారం ఏర్పాటు చేసిన మీత్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి వెళ్ళేందుకు తాము సిద్ధమని, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామంటే మాత్రం తెగతెంపులే ఉంటాయని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలను వ్యతిరేకించే శక్తులతో కలిసి పని చేయాలనీ, లేని పక్షంలో ఒంటరిగానే సాగాలన్న తమ జాతీయ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికలకు వెళ్లనున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు.
కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రాష్ట్రం ముందు చాలా సమస్యలున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు సుపరిపాలనపై ఆశతో ఉన్నారని చెప్పారు. సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఇరు ప్రాంతాల సామరస్యం, పరస్పర సహకార ఆధారంగానే తెలంగాణ ముందుకు సాగే అవకాశం ఉందనని తమ్మినేని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని సిపిఐని కోరామని, అదేవిధంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు వీరభద్రం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 17 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాల్లో పోటీ దిగనున్నట్లు ఆయన చెప్పారు.