టార్గెట్ చంద్రబాబు .. టీడీపీ హయాంలో ఆండ్రూ మినరల్స్ మైనింగ్ అక్రమాలపై ఫోకస్, లెక్క తేల్చే పనిలో జగన్ సర్కార్
చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసిపి ప్రభుత్వం గతంలో జరిగిన మైనింగ్ అక్రమాలను తిరగతోడుతోందా ? ఆండ్రూ మినరల్స్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయని గనుల శాఖ రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు జరుపుతామని వెల్లడించటం వెనుక ఆంతర్యం అదేనా? తెలుగుదేశం పార్టీ హయాంలో మైనింగ్ నిర్వహించిన ఆండ్రూ మినరల్స్ తో టీడీపీని టార్గెట్ చెయ్యనుందా? లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు జరిపిందని గనుల శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేయడం, 2019 లోనే తవ్వకాలు నిలిపివేసిన ఆండ్రూ మినరల్స్ పై సమగ్ర దర్యాప్తు ఆదేశించడం వెనుక టీడీపీని ఇరికించే ప్రయత్నం జరుగుతోందా ?అంటే అవుననే సమాధానమే వస్తోంది.
ఆండ్రూ మినరల్స్ లో లెక్కలు లేని లేటరైట్, బాక్సైట్ తవ్వకాల అనుమానం ; సమగ్ర దర్యాప్తు
విశాఖలో బాక్సైట్ మైనింగ్ అంటూ టీడీపీ టార్గెట్ .. ఎన్జీటీ దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి మైనింగ్ వ్యవహారంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక విశాఖ ఏజెన్సీలో లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వ్యవహారాన్ని తీసుకెళ్ళింది. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు కమిటీని వేసి ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలోని మైనింగ్ అవకతవకలపై విచారణ జరుపుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీ వేయడంలో విశాఖ ఏజెన్సీ వేదికగా జరుగుతున్న మైనింగ్ అక్రమ మైనింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్న టీడీపీ, గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ తాము సాధించిన విజయంగా పేర్కొంది.
విశాఖలో లేటరైట్ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీ
ఇక ప్రస్తుతం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం సుందర కోట పంచాయతీ భమిడికలొద్ది గ్రామ పరిధిలోని కొండపై లేటరైట్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ చెట్లను తొలగించడం, భారీ రోడ్ల నిర్మాణం వంటి అనేక అంశాలపై అటవీ గనుల శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికారుల సమాధానానికి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విశాఖ ఏజెన్సీ వేదికగా జరిగిన మైనింగ్ లో అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక ఇవ్వనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ మాఫియాపై టీడీపీ ఆందోళనలు
ఇదిలా ఉంటే రాష్ట్రంలో అనేక జిల్లాలలోనూ మట్టి మాఫియా , మైనింగ్ మాఫియా, కంకర మాఫియా రెచ్చిపోతున్నారని టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తుంది. కొండపల్లి రోజర్వ్ ఫారెస్ట్ లో గ్రావెల్ అక్రమ తరలింపు జరుగుతుందన్న సమాచారంతో నిజ నిర్ధారణ కోసం వెళ్ళిన దేవినేని ఉమాపై దాడి, ఆపై కేసు నమోదు, జైలుకు పంపించటంఏపీలో పెను తుఫానే రేపాయి. అప్పటి నుండి మైనింగ్ వ్యవహారం ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి తెరతీసింది
తూర్పుగోదావరి జిల్లాలో ఆండ్రూ మినరల్స్ పై జగన్ సర్కార్ ఫోకస్
ఇదిలా ఉంటే ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు హయాంలో ఆండ్రూ మినరల్స్ సంస్థ నిర్వహించిన మైనింగ్ పై అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయంటూ గనుల శాఖ రంగంలోకి దిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఆండ్రూ మినరల్స్ సంస్థ నిర్వహించిన మైనింగ్ లో లేటరైట్ కు బదులుగా బాక్సైట్ తవ్వకాలు జరిపినట్లుగా అనుమానాలున్నాయని ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. అంతేకాదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆండ్రూ మినరల్స్ మైనింగ్ నిర్వహించిందని చెబుతున్నారు. ఆ సమయంలోనే అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిందని వెల్లడించారు. దాదాపు 230 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని గుర్తించినట్లుగా చెప్పారు.
టీడీపీ హయాంలోనే ఆండ్రూ సంస్థ అక్రమ మైనింగ్ చేసిందన్న జగన్ సర్కార్
2013లో మైనింగ్ అనుమతులు తీసుకున్న ఆండ్రూ మినరల్స్ 2019 వరకు మైనింగ్ కొనసాగిందని అధికారులు వెల్లడించారు. అయితీ అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఒడిశాలోని వేదాంత కంపెనీకి 2014- 15 నుండి 2018- 19 జనవరి వరకూ ఆండ్రూ మినరల్స్ దాదాపు ముప్పై రెండు లక్షల టన్నులకు పైగా లేటరైట్ ను సరఫరా చేసినట్లుగా లెక్కలు ఉన్నాయని,4.65 లక్షల టన్నులకు పైగా చైనాకు ఎగుమతి చేశారని, అయితే అది లేటరైట్ నా ? బాక్సైట్ నా అన్నది దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చెయ్యటానికే ఆండ్రూ మినరల్స్ పై దర్యాప్తు
తవ్విన లేటరైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేసి బాక్సైట్ గా మార్చి విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయని గనుల శాఖ డైరెక్టర్ తెలిపారు. ఇక దీంతో టిడిపి హయాంలోనే అక్రమ మైనింగ్ భారీగా జరిగిందని, లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు ఆండ్రూ మినరల్స్ పాల్పడిందని పెద్ద ఎత్తున వైసిపి చంద్రబాబును టార్గెట్ చేయనుంది. టిడిపి నేతలతో ఆండ్రూ మినరల్స్ మైనింగ్ సంస్థ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే అక్రమ మైనింగ్ ను ప్రోత్సహించి, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని చంద్రబాబు పై రివర్స్ ఎటాక్ చేయడానికి సిద్ధమైంది.
Recommended Video
అక్రమ మైనింగ్ రచ్చపై ఏపీలో ఆసక్తికర చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అవినీతి ఆరోపణలు, ఒకరు చేసిన అవినీతిని మరొకరు వెలికితీసే ఎత్తుగడలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. విశాఖ ఏజెన్సీలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే, గతంలో టిడిపి హయాంలోనే పెద్ద ఎత్తున మైనింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటన్నింటినీ వెలికి తీస్తామని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల అక్రమ మైనింగ్ రచ్చ ఏపీ ప్రజలను అవాక్కయ్యేలా చేస్తోంది.