ఆప్ లోకి మాజీ జేడీ..!! పొత్తుల పైనా - కండీషన్స్ అప్లై : టార్గెట్ వైసీపీ..!!
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2024 ఎన్నికల లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ పెట్టింది. తాజాగా పంజాబ్ లో ఏకపక్ష విజయంతో ఆప్ ప్రతిష్ఠ ఒక్క సారిగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీగా ఆప్ రికార్డు సాధించింది.
ఇక, తెలంగాణలో ఏప్రిల్ 14న రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలకు ఆప్ సిద్దమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ఇన్ ఛార్జ్ గా ఆప్ నేత సోమనాధ్ భారతీకి బాధ్యతలు అప్పగించారు. ఇక, ఏపీలో ఇప్పటికే ఆప్ ఉన్నా..అది నామక్ వాస్తే అన్నట్లుగా ఉంది. అయితే, ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని కొందరు మాజీ బ్యూరోక్రాట్స్ నేరుగా కేజ్రీవాల్ తో మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఏపీలో ఆప్ ఎంట్రీ పై కసరత్తు
ఏపీలో టీడీపీ - వైసీపీకి ప్రత్యామ్నాయంగా మూడో శక్తి వైపు ప్రజలు చూస్తున్నారని ఆ మాజీ అధికారులు వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతో..కేజ్రీవాల్ త్వరలోనే హైదరాబాద్ రానునున్నట్లు సమాచారం. ఈ లోగా ఆప్ లో చేరేందుకు ఏపీకి చెందిన కొందరు మాజీ ఐఏఎస్..ఐపీఎస్ లతో పాటుగా మరి కొందరితో మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆప్ లో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన గత ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తరువాత జనసేనకు దూరమయ్యారు. కొద్ది కాలంగా కాపు నేతల సమావేశాల్లో అయన పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలోనూ కొనసాగటం లేదు. కానీ, 2024 నాటికి రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయం టీడీపీ - వైసీపీకి ధీటుగా వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఆప్ లోకి మాజీ జేడీ.. బ్యూరోక్రాట్లు
దీంతో.. సీబీఐ మాజీ జేడీతో పాటుగా ఏపీకి చెందిన మరి కొందరు మాజీ కీలక అధికారులు.. ప్రస్తుతం ఒక పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తమిళనాడులో కీలక పదవి నుంచి వచ్చిన నేత సైతం ఆప్ లో చేరేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. వీరంతా కేజ్రీవాల్ హైదరాబాద్ పర్యటనలో అధికారంగా ఆప్ లో చేరేందుకు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో తిరిగి 2014 తరహా పొత్తుల కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, బీజేపీ నేతలు మాత్రం తాము తిరిగి టీడీపీతో జత కట్టే అవకాశం లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని శపధం చేసారు. బీజేపీ ముందుకు రాకున్నా.. జనసేన టీడీపీతో కలిసే అవకాశాలు ఉంటాయని టీడీపీ సీనియర్లు అంచనా వేస్తున్నారు.
పొత్తులపై ముందస్తుగానే అంచనాలు
ఇక, కేజ్రీవాల్ - చంద్రబాబు మధ్య చాలా కాలంగా ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా క్లీన్ ఇమేజ్ ఉన్న ఆప్ ..బలమైన కేడర్ ఉన్న టీడీపీ కలిసి పోటీ చేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయనే చర్చ సాగుతోంది. అయితే, దీని పైన పార్టీ ముఖ్యుల మధ్య చర్చలు జరగాల్సి ఉందని తెలుస్తోంది.
అయితే, బీజేపీ తో పొత్తు ఉంటే ఆ కూటమికి ఆప్ మద్దతిచ్చే అవకాశం ఉండదని తాజాగా ఆ పార్టీలో చేరేందుకు సిద్దమైన నేతలు స్పస్టం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ - ఇటు బీజేపీకి సమదూరం పాటించే పార్టీలతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే పొత్తులు ఉంటాయని తేల్చి చెబుతున్నారు. టీడీపీ - జనసేన కలిస్తే వారి పొత్తులో ఆప్ సైతం చేరే అవకాశం ఉంటుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
అందరి లక్ష్యం... టార్గెట్ జగన్
అయితే, బీజేపీ తో ఏ పార్టీ పొత్తు ఉంటుందనే అంశం ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే, టీడీపీ- జనసేనతో జత కట్టటం ద్వారా వైసీపీకి వ్యతిరేకంగానే ఆప్ పని చేయనుందనేది అర్దం అవుతోంది. కానీ, ఆప్ ఎంత వరకు ఏపీలో ప్రభావం చూపించగలుగుతుందీ.. ఈ పార్టీలక కలయిక వైసీపీ పైన ఏ మేర ఎఫెక్ట్ చూపిస్తుందనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.