అన్నీ నకిలీయేనా, ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ఇలానా: కర్నాటక తెలుగు ప్రజలపై బాబు బాధ్యత!
తిరుపతి: కర్నాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు బీజేపీకి గట్టిగా బుద్ది చెప్పాలని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల కిందట వెంకన్న సాక్షిగా ఇక్కడి నుంచే మూడు నామాలు చూస్తూ మోడీ ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికే సభ పెట్టామన్నారు.
మోడీ మాటలు చెప్పి నాలుగేళ్లయినా కాలేదని, హామీల అమలుకు అన్ని ప్రయత్నాలు చేసినా విఫలం కావడంతో ధర్మపోరాటానికి నాంది పలికామన్నారు. హోదా పదేళ్లు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపడం, వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చి వెనక్కి తీసుకోవడం, బుల్లెట్ రైలుకు రూ. లక్షకోట్లు ఇస్తామని మొండిచేయి చూపడం, పెట్రోలియం కాంప్లెక్స్, దుగరాజుపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్.. ఇలా బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్నారు.
ఆ డీలర్లతో సంబంధాలు, నా వద్ద ఆధారాలు, జైలుకు పంపిస్తా: బాబుపై విజయసాయి సంచలనం
మనం ఇచ్చిన అన్నీ నకిలీవేనా?
కేంద్రం ఇచ్చిన నిధులకు మనమిచ్చిన వినియోగపత్రాలన్నీ నకిలీవంటున్నారని, ఇప్పుడు ప్రధాని వీడియోల్లో మాట్లాడిన మాటలూ నకిలీవేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. హోదా ఇస్తామని చెప్పలేదని బీజేపీ నాయకులు అంటున్నారని, మాట తప్పి ఎదురుదాడి చేస్తారా అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించిన విషయం గుర్తించాలన్నారు. ఆ రోజు మాట ఇచ్చి ఇప్పుడు ఎలా తప్పుతారన్నారు. టీడీపీకి ఎవరి పైనా కోపం లేదని, మా పొట్ట కొట్టినప్పుడు తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదన్నారు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాపై విరుచుకుపడుతున్నారు
మన దెబ్బకు ఢిల్లీలో ఉండే ప్రధాని ఉలిక్కిపడి లేవాలని, ఢిల్లీ దిగి రావాలని, వెంకటేశ్వరుడి సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలని చంద్రబాబు అన్నారు. మోడీ ఏపీకి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పులను ప్రదర్శిస్తూ.. మనం చూపించిన దాంట్లో మోసం ఏముందని ప్రశ్నించారు. ఢిల్లీ చిన్నబోయేలా రాజధానిని నిర్మిస్తామని చెప్పి కేవలం రూ.1500 కోట్లు ఇచ్చారన్నారు. వైసీపీ నయవంచన పేరిట సమావేశం పెట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు. పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు మనతో ఉండి, ఇప్పుడు ఉన్నట్టుండి నాపై విరుచుకుపడుతున్నరన్నారు. మొన్నటి దాకా అతను నాపై ఏమీ మాట్లాడలేదని, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు.
తప్పుడు కేసులు పెడతారు
వైసీపీ, పవన్ కళ్యాణ్లు కలిసి మోడీపై ఈగ వాలనీయడం లేదని చంద్రబాబు అన్నారు. బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. మనలను బెదిరిస్తారని, తప్పుడు కేసులు పెడతారని, నిధులు రాకుండా చేస్తారని, వాటన్నింటికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. కేంద్రంతో లాలూచీపడి జగన్ వేర్పాటువాదానికి మద్దతు పలుకుతున్నారన్నారు. బెయిల్ కోసం లాలూచీపడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. ఏడాదిలో అవినీతి సొమ్మును కక్కిస్తానని చెప్పిన మోడీ ఈడీ అటాచ్మెంట్లలో ఉన్న జగన్ ఆస్తులను తొలగించారన్నారు. తాత్కాలికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా భయపడమన్నారు. మనల్ని అణగదొక్కేందుకు అవినీతిపరుల్ని పక్కన పెట్టుకున్నారన్నారు.
తెలుగు ప్రజలపై బాధ్యత
తమిళనాడులా ఏపీలోను కుట్ర రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కర్నాటక ఎన్నికల్లో ఈ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న వారిని తెలుగు ప్రజలు ఒడించి బుద్ధి చెప్పాలన్నారు. ఈ బాధ్యత కర్నాటక తెలుగు ప్రజలపై ఉందన్నారు. హామీల అమలు కోసం మోడీకి అనేకసార్లు విజ్ఞప్తి చేశానని, చేయకపోతే పోరాడాల్సి వస్తుందని గట్టిగా చెప్పానని, అప్పటికీ వినకపోవడంతో యుద్ధమే శరణ్యం అనుకున్నామని, అందుకే ఎదురు తిరిగి ధర్మ పోరాటానికి నాంది పలికానన్నారు.
2003లో అందుకే బతికించాడు
ప్రత్యేక హోదా అడిగితే ఎదురుదాడి చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి అహ్మదాబాద్ లాంటి నగరం అవసరం లేదా అన్నారు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతానని, 2003లో నాపై బాంబు దాడి జరిగితే ప్రాణాలను కాపాడింది వెంకటేశ్వరుడేనని, రాష్ట్రానికి తనతో ఏదో చేయించాలనే బతికించారన్నారు. సభలో ఆయన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి హామీలు సాధిస్తామని నినాదాలు చేయించారు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో 25 లోకసభ స్థానాలు ఇస్తే ప్రధాని అభ్యర్థిని మనమే నిర్ణయిస్తామన్నారు. 2019లో బీజేపీ, వైసీపీలకు బుద్ధి చెప్పాలన్నారు.