ఇద్దరు సీఎంలకు భరోసా, కేసీఆర్కు స్టూడెంట్స్ నో, బంద్
హైదరాబాద్: టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ పీ మిస్త్రీ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను వేర్వేరుగా కలిశారు. అభివృద్ధిలో సహకరిస్తామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మిస్త్రీ చెప్పారు. మిస్త్రీ మధ్యాహ్నం కేసీఆర్తో భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం, చంద్రబాబును కలిశారు.
పారిశ్రామిక, ఐటీ, విద్యల్లో టాటా కన్సల్టెన్సీ తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు సిద్ధమని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కేసీఆర్ కోరడంతో మిస్త్రీ సానుకూలంగా స్పందించారు.
ఉచిత నిర్బంధ విద్య అమల్లో సహకరిస్తామని చెప్పారు. తమ సంస్థల ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి, పాఠశాలలకు సలహాలు ఇస్తారన్నారు. అలాగే, తక్కువ ఖర్చుతో సోలార్ యూనిట్ల స్థాపన ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో స్లమ్ ఫ్రీ సిటీగా మార్చాలనే యోచన, ఉచిత నిర్బంద విద్య అంశాలపై తెలంగాణ ప్రభుత్వంపై మిస్త్రీ ప్రశంసలు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధికి సహకరిస్తామని మిస్త్రీ చెప్పారు. ఏపీలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి తమ గ్రూపు ముందుంటుందని చంద్రబాబుకు మిస్త్రీ తెలిపారు. అలాగే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్పై ఓయు ఎఫెక్ట్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నిజామాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకను నిరసిస్తూ తెలంగాణ విశ్వవిద్యాలయం బందుకు విద్యార్థులు పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పైన లాఠీఛార్జిని నిరసిస్తూ వారు బందుకు పిలుపునిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని విద్యార్థులు చాలారోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.