Tataగ్రూపు చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్ - ఇక, ఆగేది లేదా : సంస్థ సిద్దం- కేంద్ర నిర్ణయమే నెక్స్ట్..!!
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఉక్కు ప్లాంట్ కదులుతోంది. ఉద్యోగులు అడ్డు పడినా..ఆక్రందనలు వినిపించినా...కేంద్రం ససేమిరా అంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో వంద శాతం ముందుకే వెళ్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటకీరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. అన్ని పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీ కేంద్రం ఉద్యోగులు చేసిన నిరసనల్లో అధికార - ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. విశాఖ స్థానిక ఎమ్మెల్యే గంటా వీరికి మద్దతుగా రాజీనామా సైతం చేసారు.
Recommended Video

కేంద్రానికి-ప్రధానికి సీఎం లేఖలు..
ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే కేంద్రానికి-ప్రధానికి లేఖలు రాసారు. ఉక్కు ప్లాంట్ లాభాల్లోకి వస్తోందని...ఇప్పుడు ప్రయివేటీకరణ సరి కాదని సూచించారు. ప్రయివేటీకరించకుండానే..ప్లాంట్ ఏ విధంగా కాపాడుకోవాలో లేఖలో సూచించారు. కానీ,కేంద్రం నుంచి స్పందన లేదు. తాము తీసుకున్న నిర్ణయం కొనసాగింపుకే మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ ముందుండి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసారు.

భారమంతా జగన్ పైనే వేసిన టీడీపీ..
తామంతా ముఖ్యమంత్రి ముందుకొస్తే ఆయన వెనుక ఉండటానికి సిద్దమని చెప్పుకొచ్చారు. ఇక, వైసీపీ నేతలు రాజీనామాలు చేద్దామంటూ తాము సిద్దమని..టీడీపీ ప్రకటించింది. రాజకీయంగా ఇలా సాగుతుంటే..ఈ సమయంలోనే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఒక ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను టేకోవర్ చేయటానికి టాటా సంస్థ ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రైవేటీకరణ దిశగా..విశాఖ ఉక్కు ఫ్యాక్టరీగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) కార్పోరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లటానికి రంగం సిద్దం అవుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై టాటా కన్ను..
ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకునేందుకు ఆసక్తితో ఉన్నట్లు ప్రకటించింది ప్రముఖ దేశీయ సంస్థ టాటా స్టీల్. టాటా స్టీల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కం మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ ఈ సంగతిని ధ్రువీకరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ (ఆర్ఐఎన్ఎల్)లో 100 శాతం వాటాలను ఉపసంహరించాలని ఈ ఏడాది జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

వాటాల ఉప సంహరణలో భాగంగా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణ, వాటాల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే, కేంద్రం మంత్రి ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతోంది. కానీ, కేంద్ర సంస్థగా ఉన్న విశాఖ స్టీల్ ఇక, స్టీల్ జెయింట్ గా పిలుచుకొనే టాటా గ్రూపుల చేతికి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. భౌగోళికంగా దక్షిణాదిన.. తీర ప్రాంతం కావడం, నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తోండటం, 22 వేల ఎకరాల్లో విస్తరించి ఉండటం వంటి కొన్ని ప్రధాన కారణాలు.

టాటా ఆసక్తి వెనుక..
వనరుల వల్ల వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. ఇలాంటి అడ్వాంటేజ్ విశాఖ స్టీల్ ప్లాంట్కు చాలా ఉన్నాయని అంచనా వేస్తోన్నట్లు టీవీ నరేంద్రన్ చెప్పుకొచ్చారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఒడిశాలోని నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను కూడా టేకోవర్ చేయాలని భావిస్తున్నట్లు టీవీ నరేంద్రన్ తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను దాఖలు చేస్తామని అన్నారు. ఇప్పుడు టాటా సంస్థ ముందుకు రావటంతో..కేంద్రం వీరి ప్రతిపాదన పైన పరిశీలన చేసే అవకాశం ఉంది. అయితే, రాజకీయంగా ఏదైనా నిర్ణయం జరిగితే తప్ప..ప్రయివేటీకరణ నిర్ణయం ఆగే అవకాశం కనిపించటం లేదని కార్మికులు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications