విశాఖకు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ - లైన్ క్లియర్..!!
సాగర తీరాన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ కొలువు తీరనుంది. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ ఏర్పాటుకు వీలుగా అన్ని అనుమతులు దక్కాయి. టీసీఎస్ సంస్థ విశాఖ కేంద్రంగా కార్యకలాపాలకు వీలుగా ఏపీ ప్రభుత్వం లీజు ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లీజుకు డల్లాస్ టెక్నాలజీస్ బిల్డింగ్ ఇస్తూ ఉత్త్వర్వులు జారీ చేసింది. ఈ సంస్థ ద్వారా తొలి దశలో 2 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ పక్కనే ఈ వ్యూహాత్మకంగా టీసీఎస్ ఈ ప్రాంగణం ఎంపిక చేసుకుంది.
విశాఖ కేంద్రంగా
విశాఖ కేంద్రంగా డల్లాస్ టెక్నాలజీస్ కంపెనీకి ఏపీఐఐసీ 2016లో హిల్-2పై 7,774.90 చ.మీ. భూమిని కేటాయించింది. అందులో రెండేళ్ల క్రితం ఆ కంపెనీ భవన నిర్మాణం ప్రారంభించింది. గ్రౌండ్+3 అంతస్థుల భవనం నిర్మించింది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తోంది. అందులో 1,400 మంది వరకు పనిచేసుకొనే అవకాశం ఉంది. విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభం కోసం టీసీఎస్ టీం విశాఖలో పర్యటించింది. అక్కడ డల్లాస్ భవనం లో తమకు స్పేస్ కావాలని చర్చలు జరిపారు. ఈ నెల మొదటి వారంలో విశాఖకు వచ్చిన టీసీఎస్ బృందాన్ని డల్లాస్ భవనం ఆకర్షించింది. వారితో చర్చలు జరిపారు. లీజుకు ఇవ్వాలని అడిగారు. ఇందుకు అంగీకరించటంతో అక్కడే టీసీఎస్ సంస్థ ప్రారంభం కానుంది.

ప్రభుత్వం సూచనలు
టీసీఎస్ కు భవనం లీజుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని పేర్కొంది. సెట్ బ్యాక్స్ ప్రయోజనాల కోసం కోరిన స్థలాన్ని మంజూరు చేయాలని దానికి చ.మీ.కు రూ.10 వేలు చొప్పున వసూలు చేయాలని ఏపీఐఐసీకి సూచించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తక్షణమే భవనాన్ని పరిశీలించి, నిబంధనల ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేయాలని ఆదేశించారు. సంస్థ త్వరగా ప్రారంభం కావడానికి అవసరమైన అన్నిరకాల పనులు పూర్తిచేసుకోవ డానికి ప్రభుత్వ శాఖలన్నీ సహకరించాలని ప్రభుత్వం సూచించింది.












Click it and Unblock the Notifications