చంద్రబాబు నిర్ణయంతో ఏకీభవించని టీడీపీ శ్రేణులు: పసుపు కంచుకోట నేతల అసంతృప్తి, పోటీకి సై..
అనంతపురం: పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలతోపాటు జిల్లా, స్థానిక నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. పోటీ చేయకుండా ఉండటం సరైననది కాదని ఇప్పటికే సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజుతోపాటు మరికొందరు నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అనంత నేతలు
తాజాగా, అనంతపురం జిల్లా టీడీపీ నేతలు కూడా పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనేక గ్రామాలు, మండలాల్లో టీడీపీ బలంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయం సమంజసం కాదని వారంటున్నారు.
గతంలో అనంతపురం టీడీపీ కంచుకోటగా..
కాగా, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో అత్యధిక పరిషత్ స్థానాలను దక్కించుకుంది. వైసీపీ కొన్ని స్థానాలకే పరిమితమైంది. అనంతపురం జడ్పీ ఛైర్పర్సన్ కూడా టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ హయాం నాటి నుంచి కూడా అనంతపురం టీడీపీకి కంచుకోటలా ఉంది. ఇక హిందూపురం అయితే, తన సొంత ఇలాకాగా ప్రకటించారాయన. ఫ్యాక్షన్ ప్రాంతాలతోపాటు బీసీల్లోని కొంతమంది మద్దతు కూడా టీడీపీకి ఉంది.
వైసీపీకి జైకొట్టిన అనంత ప్రజలు
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఘోరంగా దెబ్బతింది. హిందూపురం, ఉరవకొండ మినహా టీడీపీ అన్ని స్థానాల్లోనూ ఓటమిపాలైంది. అనంతపురంలో జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపొందగా, 2 పార్లమెంటు స్థానాలను కూడా కైవసం చేసుకుంది. అంతేగాక, ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ భారీ విజయాలను నమోదు చేయగా, టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది.
చంద్రబాబు బహిష్కరణ పిలుపు ఇచ్చినా..
ఈ నేపథ్యంలోనే వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, చంద్రబాబు నిర్ణయాన్ని మెజార్టీ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తుండటం గమనార్హం. అంతేగాక, జిల్లాలో 63 మండలాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్క జడ్పీటీసీ స్థానం కూడా వైసీపీకి ఏకగ్రీవం కాలేదని పార్టీ నేతలంటున్నారు.
చంద్రబాబు నిర్ణయంతో టీడీపీ నేతల్లో నిరాశ.. కానీ..
ఎన్నికల్లో పోటీ చేయకపోవడమనే నిర్ణయం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లోని నేతలు, కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోందని హిందూపురం లోక్సభ నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఫ్యాక్షన్ ప్రత్యర్థులతో పోరాడామని, మండల ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ కంటే అత్యధిక స్థానాలను చేసుకున్నామని పెనుకొండ నేత తెలిపారు. కాగా, తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పదవిని చేపట్టారు.
ఈ క్రమంలో అన్ని మండలాల్లో టీడీపీ పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు బలంగా కోరుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎన్నికల బరిలోకి దిగారు. ప్రస్తుతం అనంతపురం జడ్పీ ఛైర్ పర్సన్ స్థానం ఎస్సీ జనరల్కు కేటాయించడం జరిగింది.