జగన్ కావాలా..జనం కావాలా: వైసీపీ అమరావతి నేతలకు అల్టిమేటమ్: టీడీపీ మైండ్ గేమ్..!
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించేందుకు అధికార..ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందు కోసం టీడీపీ ప్రధానంగా అమారావతి ప్రాంత వైసీపీ నేతల ను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే రాజధాని గ్రామాల నియోజకవర్గాలైన మంగళగిరి..తాడికొండ ఎమ్మెల్యేల మీద స్థానికులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసారు. వారు కనిపించటం లేదంటూ ఆ ఫిర్యాదు లో పేర్కొన్నారు.
ఇక, ఇదే ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం రాజధాని ప్రాంత రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ నిరసనల్లో పాల్గొంటున్న రైతు ల నుండి వినిపిస్తోంది. తాజాగా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో సహా ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కావాలో..జనం కావాలో తేల్చుకోవాలంటూ కొత్త నినాదం తెర మీదకు తెచ్చారు. రాజకీయంగా వైసీపీ నేతల ను ఫిక్స్ చేసేందుకు టీడీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది.
ఎవరి వైపో తేల్చుకోండంటూ అల్టిమేటం...
రాజధాని రైతులకు మద్దతు ప్రకటిస్తున్న ఆ ప్రాంత టీడీపీ నేతలు అదే సమయంలో వైసీపీ నేతలను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజధాని ప్రాంత వైసీపీ నేతలు రాజీనామా చేస్తే అమరావతి నుండి రాజధాని తరలింపు ముందుకు వెళ్లదని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో..నిరసనల్లో ఉన్న ఆ ప్రాంత స్థానికులు సైతం ఇదే నినాదం అందుకున్నారు.
తాజాగా.. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు అల్టిమేటం జారీ చేసారు. జగన్ కావాలో.. నియోజకవర్గ జనం కావాలో.. ఎమ్మెల్యే ఆర్కే తేల్చుకునే సమయం వచ్చిందని.. అమరావతి కొనసాగింపునకు మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయాని డిమాండ్ చేసారు. ప్రజల భవిష్యత్తు కన్నా వ్యక్తిగత భవిష్యత్తే ముఖ్యమని ఆర్కే భావిస్తే చరిత్ర హీనుడుగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
టీడీపీ నేతల డిమాండ్ అదే..
కొద్ది రోజులు టీడీపీ నేతలు రైతుల దీక్షా వేదికల నుండి ఇదే డిమాండ్ ను ప్రధానంగా వినిపిస్తున్నారు. తాజాగా..రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు..నేతలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమై ముఖ్యమంత్రి తీసుకొనే నిర్ణయానికి మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు. దీని పైన రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
అయితే, అదే సమావేశంలో అమరావతి ప్రాంతంతో రైతులకు న్యాయం చేయాలని వారు కోరినట్లుగా తెలిసింది. అమరావతి డెవలప్ మెంట్ దిశగా ప్రణాళిక ప్రకటించాలని అభ్యర్ధించారు. ఈ మేరకు ప్రభుత్వం పెద్దల నుండి వారికి హామీ సైతం లభించిందని సమాచారం. అయితే, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు తమ వద్దకు రాకపోవటం..మద్దతివ్వకపోవం పైన నిరసనలు వ్యక్తం చేస్తున్న స్థానికులు నిలదీస్తున్నారు. వారి వద్దకు వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని మరింతగా రెచ్చ గొట్టినట్లు అవుతుందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.
టీడీపీ మైండ్ గేమ్ ఆరంభం..
రాజధాని ప్రాంత వైసీపీ నేతలను రాజకీయంగా ఫిక్స్ చేయటానికి ఇదే సరైన సమయంగా టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో వారి మీద ఒత్తిడి పెంచే మైండ్ గేమ్ ను కొనసాగిస్తోంది. రాజధాని పరిధిలోని రెండు జిల్లాల్లో వైసీపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో 30 అసెంబ్లీ సీట్లు...మూడు లోక్ సభ సీట్లు గెలుచుకుంది. లోకేశ్ పోటీ చేసిన మంగళగిరిలోనూ వైసీపీ గెలిచింది.
దీంతో..ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల్లో రాజధాని తరలింపు ప్రతిపాదన పైన ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని టీడీపీ భావిస్తోంది. నేరుగా చంద్రబాబు ఇప్పటికే ఆ ప్రాంతంలో రైతుల నిరసనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు ఈ తరహా టీడీపీ వ్యూహాలను వైసీపీ నేతలు ఎలా తిప్పి కొడతారో చూడాలి.