చంద్రబాబుతో చెలిమికి భారతీయ జనతాపార్టీ మూడు కారణాలు
నాలుగు సంవత్సరాల నుంచి ఎదురెదురుగా ముఖముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అంతటి వైరం తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ మధ్య నడిచింది. ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ వచ్చినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కాకుండా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ని ఆహ్వానించారు. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కష్టమనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా రాజకీయాలు మారిపోయాయి.
ఢిల్లీ నుంచి ఆహ్వానం
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనడానికి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అందరినీ పరిచయం చేసుకునే సందర్భంలో ప్రధానమంత్రి మోడీ చంద్రబాబుతో ఐదు నిముషాలు ప్రత్యేకంగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించింది. పార్టీతో పొత్తు కోసం వేచిచూస్తున్న టీడీపీ శ్రేణులకు కూడా ఈ సంఘటన ఆనందం కలిగించింది. నెమ్మదిగా ఈ రెండు పార్టీల మధ్య స్పర్థలు వీడిపోతున్నాయని భావిస్తున్నారు.
మూడోసారి అధికారం చేపట్టాలంటే..
బీజేపీ అధినాయకత్వం బాబుతో సఖ్యతగా ఉండటానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో వరుసగా ఏ పార్టీ మూడోసారి అధికారం చేపట్టలేదు. యూపీయే కూడా 2004, 2009లో అధికారం చేపట్టి 2014లో కోల్పోయింది. ఎన్డీయే కూడా 2014, 2019లో వరుసగా అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో ఏమవుతుందనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఆ సెంటిమెంట్ నుంచి బయటపడాలి.. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాలి అంటే పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల సాధ్యమైనన్ని లోక్సభ సీట్లు రాబట్టుకోవాలనే యోచనలో బీజేపీ నేతలున్నారు.
Recommended Video
కూటమి ఏర్పాటు చేయకుండా నిరోధించడం
మరో కారణం ఏమిటంటే గత ఎన్నికల సమయంలో మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు అన్ని పార్టీలను కూటమిగా ఏర్పాటుచేసి ఒకరకంగా బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ప్రస్తుతానికి చంద్రబాబు ఒక్కడే ఢిల్లీ స్థాయిలో కూటమి కట్టగలరు కాబట్టి భవిష్యత్తులో అటువంటి ఇబ్బంది లేకుండా బీజేపీ చూసుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరహా పరిణామాలను నిరోధించడానికే ఆయనతో స్నేహం చేసి దగ్గరకు తీయడం ఒక్కటే అని భావిస్తోందంటున్నారు.
తెలంగాణ ప్రధాన కారణం
మరో ప్రధాన కారణం తెలంగాణలో అధికారం దక్కాలంటే 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తున్న సెటిలర్ల ఓట్లను బీజేపీవైపు తిప్పాలి.. అది చంద్రబాబు వల్లే సాధ్యపడుతుంది.. ఇవన్నీ బేరీజు వేసుకున్న బీజేపీ ఆయనకు స్నేహహస్తాన్ని చాచినట్లు భావిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి రావాలంటే కేంద్రం కూడా సహకరించాలని మొదటి నుంచి చంద్రబాబు కోరుకుంటున్నారు. కాబట్టి ఇద్దరికీ ఉభయ కుశలోపరిగా ఉంటుందని, అందుకే ఇరుపార్టీల మధ్య నెమ్మదిగా స్నేహమనే మొగ్గ చిగురిస్తోందంటున్నారు.