టీడీపీ - జనసేన మిలాఖత్ : పదవుల పంపకం ఇలా- మంత్రి రంగనాధ రాజుకు జలక్...!!
2019 ఎన్నికల్లో అనూహ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పట్టు సాధించింది. రెండు మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గెలిచింది. పంచాయితీ..మున్సిపల్ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని నిలబెట్టు కుంది. ఇక, జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల్లో జిల్లా లో వైసీపీనే మెజార్టీ సీట్లు సాధించినా..జిల్లా మంత్రి ఇలాకాలో మాత్రం షాక్ తప్పలేదు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం నుంచి మంత్రులు - ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని..ఒక్క స్థానం ఓడిపోయినా పదవులు వదులుకోవాల్సి వస్తుందనే తరహాలో హెచ్చరికలు అందాయి.
కానీ, మంత్రి రంగనాధ రాజు సొంత నియోజకవర్గంలో సీన్ రివర్స్ అయింది. తాజాగా వెల్లడైన జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం జిల్లాలో 876 ఎంపీటీసీలు ఉండగా..అందులో 73 ఏకగ్రీవం అయ్యాయి. వైసీపీ 65, టీడీపీ 3, జనసేన 1, ఇతరులు 4 దక్కించుకున్నారు. ఇక, 781 ఎంపీటీసీ లకు ఎన్నికలు జరగ్గా వైసీపీ 608, టీడీపీ 99, జనసేన 60, బీజేపీ 3 గెలుచుకున్నాయి. ఇదే జిల్లాలోని వీరవాసరం ..మంత్రి రంగనాధ రాజు సొంత నియోజకవర్గం ఆచంటలో మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఆధిక్యత సాధించాయి.

వీరవాసరం..ఆచంట మండలాల్లో టీడీపీ - జనసేన మధ్య అనధికార పాత్తుతో స్థానికంగా రెండు పార్టీలకు చెందిన నేతలు ఒప్పందాలు చేసుకున్నారు. ఫలితంగా వీరవాసరం జెడ్పీటీసీ జనసేన దక్కించుకుంది. అదే మండలం ఎంపీటీసీ ఫలితాల్లో టీడీపీకి 4, జనసేన కు 8, వైసీపీకి ఏడు స్థానాలు దక్కాయి. అదే విధంగా ఆచంట ఎంపీపీ కోసం ఈ రోజు జరుగుతున్న ఎన్నిక అధికార వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారతోంది. ఇక్కడ ఏడు ఎంపీటీసీలు టీడీపీ గెలవగా, వైసీపీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. కాగా, జనసేన 4 స్థానాలు దక్కించుకంది.
అయితే, వైసీపీకి ఎంపీపీ దక్కకుండా ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు పరస్పర అవగాహనకు వచ్చారు. దీంతో..వీరవాసరం, ఆచంట మండలాల్లో ప్రతిపక్ష అభ్యర్థులు ఎంపీపీగా ఎన్నికయ్యే అవకాశాలు పూర్తిగా మెరుగపడ్డాయి. ఆచంటలో ఎంపీటీసీలు ఇప్పటికే క్యాంపులకు చేరారు. వీరందరినీ నిర్ణీత సమయంలోపే ఆచంటకు చేర్చేందుకు తెలుగుదేశం, జనసేన నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అలజడికి తావులేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆచంట ఎంపీపీ టీడీపీకి కేటాయించబోతున్నారు.
దీంతో మంత్రి రంగనాథరాజు వర్గం ఎంపీటీసీలకు వలపన్ని చివరిలో అధికార రాజకీయం ఏదైనా చేయబోతున్నారా అనే అనుమానంతో మిగతా వారు ఉన్నారు. అలాగే వీరవాసరం మండలంలోనూ ఎన్నిక సజావుగా జరిగేలా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన ఎంపీటీసీలు పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. ఆచంట ఎంపీపీ స్థానంలో ఇప్పటికే టీడీపీ - జనసేన మధ్య కుదిరిన ఒప్పందం మేరకు టీడీపీకి ఎంపీపీ పదవి దక్కేలా ప్రణాళికలు సిద్దం చేసారు. అదే సమయంలో జనసేనకు ఉపాధ్యక్ష పదవితో పాటుగా కో ఆప్షన్ పదవి ఇచ్చేలా ఒప్పందం జరిగింది.
రెండున్నారేళ్ల తరువాత అవే పదవుల్లో మార్టీలు అటు - ఇటు మార్చుకొనేలా అంగీకారం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎంపీపీ వైసీపీకి దక్కేలా మంత్రి రంగనాధ రాజుతో పాటుగా పేర్ని నాని సైతం ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రెండు పార్టీలు ఒప్పందం చేసుకోవటంతో దాదాపుగా ఆ రెండు పార్టీలకే పదువుల దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, మంత్రికి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారటంతో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు మధ్నాహ్నం జరిగే ఎంపీపీ ఎన్నికల్లో ఆచంట రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications