బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికి అదే సీట్లో ఇన్ ఛార్జ్ పదవి..! టీడీపీ షాకింగ్ ..!
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటై రెండేళ్లు దాటిపోయింది. కూటమి పార్టీలు ప్రస్తుతం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అయితే ఇందులో ఓ అంశంలో మాత్రం కూటమిలోని టీడీపీ (TDP) మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలో అసంతృప్తి కనిపిస్తోంది. అదే టీడీపీ ఇన్ ఛార్జ్ ల వ్యవహారం. ఇప్పటికే బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ ఛార్జ్ ల హవా కొనసాగుతుందనే ప్రచారం ఉండనే ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్న చోట టీడీపీ ఇన్ ఛార్జ్ ను నియమించింది. అయితే పైకి చూసేందుకు ఇదో చిన్న నిర్ణయంగా కనిపిస్తున్నా దీని వెనుక ఉన్న నేపథ్యం, భవిష్యత్ రాజకీయం మాత్రం స్ధానికంగా చర్చనీయాంశమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో దశాబ్దానికి పైగా రాజకీయం చేస్తూ, పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో మాత్రం బీజేపీలో చేరి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఇవ్వాల్సిన ఎమ్మెల్యే సీట్ల కోటాలో కచ్చితంగా గెలిచే సీట్లపై టీడీపీ పలు సర్వేలు చేసింది. ఇందులో అనపర్తి కూడా ఒకటి. అయితే అప్పటికే తమ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఆశావహుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే సులువుగా గెలుస్తారు. కానీ బీజేపీకి ఈ సీటు కావాలని పట్టుబట్టింది. దీంతో అదే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపి మరీ, టికెట్ ఇప్పించి చంద్రబాబు గెలిపించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు అదే అనపర్తిలో టీడీపీ ఇన్ ఛార్జ్ గా నల్లమిల్లి కుమారుడు మనోజ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ ఛార్జ్ లు హవా సాగిస్తున్న వేళ మనోజ్ కుమార్ రెడ్డి నియామకం వెనుక కారణాలు ఏంటన్నది త్వరలో తేలిపోనున్నాయి.















Click it and Unblock the Notifications