Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొత్తుతో టిడిపిలో కత్తులు: సీట్లపై తకరారు, బిజెపికి ఇవే!

హైదరాబాద్: చాలా రోజులుగా ఉత్కంఠను రేకెత్తించిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఎట్టకేలకు పొత్తు పొడిచింది. అయితే, పొత్తు పైన ఇరు పార్టీలలోను తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. పొత్తులో భాగంగా బిజెపికి తెలంగాణలో 47 అసెంబ్లీ, 8 లోకసభ స్థానాలు, సీమాంధ్రలో 15 అసెంబ్లీ, 5 లోకసభ స్థానాలు టిడిపి కేటాయించింది. ఇప్పటికే ఏఏ స్థానాలు అనేది దాదాపు తెలుస్తోన్నప్పటికీ పూర్తిగా తేలేందుకు రెండు మూడు రోజులు పట్టనుంది.

పొత్తుకు ముందే ఇరు పార్టీల్లో అసంతృప్తి రాగాలు ఆకాశాన్ని తాకాయి. పార్టీలోను, పరస్పరం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలు మరో పార్టీకి వెళ్లడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీమాంధ్ర టిడిపిలో కోడెల శివప్రసాద్, బొండా ఉమ, తెలంగాణ టిడిపిలో మైనంపల్లి హన్మంతు రావు తదితరులు ఇప్పటికే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని వారు చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

TDP back in NDA; ties up with BJP for LS, AP state polls

పొత్తులో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం బిజెపికి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న మైనంపల్లి ఆదివారం ఏకంగా చంద్రబాబు నివాసం ఎదుట తన కార్యకర్తలతో ఆందోళన చేపట్టారు. తాను మొదటి నుండి పార్టీకి లాయల్‌గా ఉన్నానని, ఇక్కడి నుండి తాను పోటీ చేయాలని స్థానిక టిడిపి నేతలు బలంగా కోరుతున్నారని ఆయన చెబుతున్నారు. మల్కాజిగిరి బిజెపికి వెళ్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చెప్పారు. మైనంపల్లి వర్గీయులు చంద్రబాబుపై తిట్ల దండకం మొదలు పెట్టారట.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా బిజెపికి కేటాయిస్తున్నారనే వార్తల నేపథ్యంలో టిడిపి నేత బొండా ఉమ అనుచురుల బాబు నివాసం వద్ద హంగామా చేశారు. టిడిపి గెలిచి కీలక స్థానాలు ఎలా ఇస్తారని బొండా ఉమ ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ బిజెపికి ఇస్తే మరో మూడు నాలుగు నియోజకవర్గాల పైన అ ప్రభావం పడి, టిడిపి ఆ స్థానాల్లో ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు. టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ కూడా అసంతృప్తితో ఉన్నారు.

పొత్తులో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట స్థానాన్ని బిజెపికి ఇవ్వాలని టిడిపి నిర్ణయించింది. దీంతో స్థానిక టిడిపి నేతలు కోడెల శివప్రసాద రావు నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. బిజెపికి సీటు ఇవ్వడంపై మండిపడ్డారు. దీంతో నరసారావు పేట నుంచి తానే పోటీ చేస్తానని కోడెల ప్రకటించారు. గెలిచే సీట్లను బిజెపి కోరుకోవాలని, కేడర్‌లేని చోట పోటీచేయాలనుకోవడం సరికాదని, చంద్రబాబును కలసి తన అభిప్రాయం చెబుతానన్నారు. ఆయన అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటున్నారు.

తెలంగాణ బిజెపిలోను తీవ్ర అసంతృప్తి నెలకొంది. బిజెపి మొదటి నుండి అరవైకి పైగా అసెంబ్లీ, ముఖ్యమంత్రి పదవిని కోరుతోంది. కానీ, 47 అసెంబ్లీ, 8 లోకసభ స్థానాలు వస్తున్నాయి. దీనిపై టి బిజెపి ఆగ్రహంతో ఉంది. అంతేకాదు బిజెపి తెలంగాణ ప్రాంత అధ్యక్షులు కిషన్ రెడ్డి టిడిపి అధినేతతో కలిసి బిజెపి అధిష్టానం పెద్దలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి కూడా వెళ్లలేదు. ఇది అసంతృప్తితోనే అంటున్నారు.

అయితే, కిషన్ రెడ్డి మాత్రం టిడిపితో పొత్తు వల్ల తమ పార్టీ క్యాడర్ అసంతృప్తితో ఉందని, వారికి నచ్చ చెప్పేందుకే తాను విలేకరుల సమావేశం కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లలేదని చెబుతున్నారు. సీమాంధ్ర టిడిపి, సీమాంధ్ర బిజెపి, తెలంగాణ టిడిపిలో మరింత అసంతృప్తి కనిపించే అవకాశముంది. దేశం కోసం పొత్తు పెట్టుకుంటున్నామని, నాయకులు అర్థం చేసుకోవాలని, వారందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

నారాయణపేట బిజెపికి వద్దని తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. బిజెపి ఒత్తిడికి చంద్రబాబు లొంగిపోయారని ఆరోపించారు. రెండు పార్టీల్లోను నిరసన గళాలు వెల్లువెత్తాయి. టిడిపి కార్యాలయం, చంద్రబాబు నివాసంలో అసంతృప్తుల హంగామా ఉంది. అయితే, బిసి సంఘాల నేత, టిడిపి నేత అర్ కృష్ణయ్య నాయకులతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

బిజెపికి కేటాయించనున్న లోకసభ సీట్లు ఇవే!

సీమాంధ్రలో... విశాఖపట్నం, అరకు, నర్సాపురం, విజయవాడ, నెల్లూరు తిరుపతి, రాజంపేటలలో ఐదు స్థానాలు బిజెపికి ఇచ్చే అవకాశముంది. తెలంగాణలో... సికింద్రాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, భువనగిరి, పెద్దపల్లిలుగా సమాచారం.

సీట్ల తకరారు

అసంతృప్తి, బిజెపి నిరాసక్తత నేపథ్యంలో పలు సీట్లు తారుమారయ్యే అవకాశముంది. తొలుత విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇవ్వాలని టిడిపి భావించింది. కానీ, బొండా ఉమ తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దీంతో నూజివీడు బిజెపికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తాడేపల్లిగూడెంకు బదులు ఏలూరు ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. నెల్లూరు లోకసభ వద్దని టిడిపి ఆశావహుడు చంద్రబాబును కోరుతున్నారు. ఇక బిజెపి రాజోలు, కడప అసెంబ్లీ నియోజకవర్గాల పైన అనాసక్తి ప్రదర్శిస్తోంది. నెల్లూరు రూరల్, అనంతపురం టౌన్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తే టిడిపికి నష్టమని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

జవదేకర్‌కు ఝలక్

పలువురు భారతీయ జనతా పార్టీ ఆశావహులు నాంపల్లి పార్టీ కార్యాలయంలో బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్‌ను అడ్డుకున్నారు. టిడిపితో పొత్తుతో పార్టీకి నష్టమని తెలంగాణ బిజెపి నేతలు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+