పవన్-రేణూ దేశాయ్ బంధం లాంటిదే బీజేపీ-టీడీపీ బంధం:జేసీ దివాకర్ రెడ్డి
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ లా మరిన ఎంపి జెసి దివాకర్ రెడ్డి ప్రస్తుత టిడిపి-బిజెపి బంధంపై తన దైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను బీజేపీ-టిడిపి అనుబంధం గురించి ప్రశ్నించగా జెసి ప్రస్తుతం తమ మధ్య ఉన్న బంధం పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ మధ్య ఉన్నసంబంధం లాంటిదని చెప్పారు.
వారు విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల భవిష్యత్ కోసం అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు...బీజేపీతో టీడీపీ అనుబంధం కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసమే...అని చెప్పారు. అయితే మోదీకి పార్లమెంట్లో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ ఏపీ పట్ల ఏమాత్రం కనికరం చూపించడం లేదని ఆయన అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రంతో టిడిపి విభేదించిన నేపథ్యంలో టిడిపి మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్టీయేలో భాగస్వామిగానే కొనసాగుతుంది. అయినప్పటికీ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ, బీజేపీ మధ్య అసహజ వాతావరణమే ఉందని చెప్పుకోవాలి.