వైఎస్ వివేకా హత్య జగన్కి తెలిసే జరిగింది..? సునీతకు కేసీఆర్ రక్షణ కల్పించాలి !! : బుద్దా వెంకన్న
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. కేసు విచారణకు సీబీఐ వేగవంతం చేసింది. అటు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. అధికార వైసీపీ , టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. వివేకా హత్య సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసు విచారణ చేస్తున్న సీబీఐపైనే వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఎంత దుర్మార్గుడో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకా కేసులో సునీతమ్మను ఇరికించే కుట్ర ?
వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని బుద్దా వెంకన్న నిలదీశారు. పార్టీ నుంచి ఆయనను ఎందుకు జగన్ సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. నిందితులను కాపాడుతుంది జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. వివేకా కుమార్తె సునీతమ్మను ఈ కేసులో ఇరికించేలా జగన్ ప్లాన్ చేస్తున్నాని మండిపడ్డారు. అసలు దొంగలను జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సునీతకు కేసీఆర్ రక్షణ కల్పించాలి
వైఎస్ సునీతా రెడ్డి కుటుంబం తన ఫ్యామిలీతో హైదరాబాద్లోనే ఉందని బుద్దా వెంకన్న తెలిపారు.. ఆమె కుటుంబానికి ప్రాణ గండం ఉంది. ఈనేపథ్యంలో సునీత కుటుంబానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రక్షణ కల్పించాలని కోరారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని .. ఆమె మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రోజా మాటలకు విలువలేదని మండిపడ్డారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. దీనిపై తాము మాట్లాడితే మాపై కూడా కేసుల పెట్టొచ్చని , దాడులు కూడా చేయొచ్చని ఆరోపించారు. వైసీపీ సవాళ్లను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.
పులివెందులలో బీ టెక్ రవి
వైఎస్ సునీతను పులివెందుల అభ్యర్థిగా టీడీపీ బరిలోకి దించబోతుందని వైసీపీ నేతల ఆరోపణలకు బుద్దా వెంకన్న తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీ చేస్తారని ఇప్పటికే తమ పార్టీ అధినేత చంద్రబాబు స్ఫష్టంగా చెప్పారని తెలిపారు. ఈనేపథ్యంలో సునీత ఎందుకు పోటీ చేస్తుందని చురకలు అంటించారు. సునీత వెనుక టీడీపీ లేదని . కావాలనే ఆమెపై వైసీపీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు వదిలించుకుందామా.. అని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని దుయ్యబట్టారు.