టీడీపీ జెండా ఎక్కడ ఎగిరితే..అక్కడ శుభం, శాంతి: దేశభక్తుల స్ఫూర్తితో: చంద్రబాబు పిలుపు
అమరావతి: తెలుగుదేశం పార్టీ.. దేశ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఘనతను ఆర్జించుకున్న ఏకైక పార్టీ ఇదొక్కటే. ఒకదశలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే విషయాన్ని నిర్దేశించిన టీడీపీ.. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పాత్ర పతనం అంచుల్లో నిలిచింది. ఒక్క ఎమ్మెల్యే తప్పుకొంటే.. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండకపోవచ్చు. ఈ పరిణామాల మధ్య టీడీపీ 40వ వ్యవస్థపక దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేడర్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆ జీవోపై చంద్రబాబు సంతకం: ల్యాండ్ పూలింగ్..భారీ కుంభకోణం: తప్పు చేయకపోతే స్టే ఎందుకు: సజ్జల
కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి దేశభక్తుల స్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని చంద్రబాబు పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. తెలుగువారందరూ ఆత్మగౌరవంతో, సమసమాజానికి బాటలువేస్తూ టీడీపీ ఆవిర్భవించిందని చెప్పారు. తెలుగు నేల ఘనతను ప్రపంచం నలు దిక్కులా ప్రసరింపజేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు అభివృద్ధిపథంలో దూసుకుపోవాలనే బలమైన అకాంక్షతో ఎన్టీ రామారావు పార్టీని నెలకొల్పారని అన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలను సాధించడానికి ప్రతి కార్యకర్త పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు అసలైన రామరాజ్యాన్ని అందించేంత వరకు విశ్రమించరాదని చెప్పారు. ఈ దిశగా వ్యవస్థాపక దినం సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదలకు ఆత్మగౌరవంతో కూడిన సంక్షేమాన్నిచ్చిన పార్టీ తెలుగుదేశం ఒక్కటేనని నారా లోకేష్ అన్నారు. రాజకీయంగా బడుగులకు ఎదిగే స్వేచ్ఛను ఇచ్చిందని, మహిళలకు సాధికారతను కల్పించిందని చెప్పారు. పార్టీ.. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం జెండా ఎక్కడ ఎగిరితే అక్కడ శుభం, శాంతి కొలువు ఉంటాయని పేర్కొన్నారు.
తెలుగువారి కోసం తెలుగు వెలుగు ఎన్టీ రామారావు మహోన్నత ఆశయాలతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. తెలుగుజాతికి 40 ఏళ్ల అండ తెలుగుదేశం జెండా ఒక్కటేనని, వెన్నుచూపని కార్యకర్తలు, నాయకులే తమ పార్టీకి బలం, బలగమని నారా లోకేష్ అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తోన్న టీడీపీ కుటుంబసభ్యులందరి సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. కష్టపడి పనిచేస్తున్న ప్రతీ ఒక్కరి శ్రమనీ గుర్తించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు.