జగన్ను అలా ఇరుకున పెట్టే ప్రయత్నం, అఖిలప్రియపై వ్యూహాత్మకంగా..
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నంద్యాల బహిరంగ సభలో జగన్ తొలి రోజు చేసిన కాల్చివేత వ్యాఖ్యలతో పదేపదే టార్గెట్ చేస్తున్నారు.
నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నంద్యాల బహిరంగ సభలో జగన్ తొలి రోజు చేసిన కాల్చివేత వ్యాఖ్యలతో పదేపదే టార్గెట్ చేస్తున్నారు.
జగన్ టార్గెట్ చంద్రబాబు
శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరిన బహిరంగ సభలో.. ముఖ్యమంత్రిని కాల్చివేసినా తప్పులేదన్నారు. ఆ తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చని ఈ ముఖ్యమంత్రికి ఉరిశిక్ష వేయామనడం తప్పా అని నిలదీశారు. తాజాగా, ముఖ్యమంత్రి చొక్కా, నిక్కరు విప్పుతానన్నారు.
ఆ వ్యాఖ్యలతో ఇరుకున పెట్టే ప్రయత్నం
టిడిపి నేతలు, మంత్రులు నంద్యాలలో ప్రధానంగా జగన్ వ్యాఖ్యలను పదేపదే లేవనెత్తుతూ వైసిపిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలపై సోమవారం సీఎం చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు.
నా ముందు ఎంత?
జగన్పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. తాను ఉన్మాది మాటలు పట్టించుకోనని ధ్వజమెత్తారు. వైసిపి ఉన్మాద పార్టీ అని విమర్శించారు. తన అనుభవం ముందు జగన్ వయస్సు అంత అని ప్రశ్నించారు.
నలభై ఏళ్ల వ్యక్తిత్వం
40 ఏళ్లుగా తాను వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నానని, తన క్లీన్ ఇమేజ్ను కలుషితం చేయడం ఎవరి వల్ల కాదని జగన్ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.
వైయస్ భరించలేకపోయాడు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూడా జగన్ ను భరించలేకపోయారని చంద్రబాబు అన్నారు. విమర్శల పేరుతో ఇష్టానుసారం మాట్లాడితే తాము ఊరుకునే సమస్య లేదని చంద్రబాబు హెచ్చరించారు.
అఖిలప్రియపై పెద్దగా విమర్శలు లేవు
అటు జగన్, వైసిపి నేతలు చంద్రబాబునే ప్రధానంగా టార్గెట్ చేశారు. భూమా కుటుంబాన్ని పెద్దగా విమర్శించడం లేదు. స్థానికంగా న్యూట్రల్ ఓటర్లలోను భూమా ఫ్యామిలి ప్రభావం కొంత కనిపిస్తుంది. అందుకే భూమా ఫ్యామిలీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. కేవలం తల్లిదండ్రుల ఆశయాలను అఖిలప్రియ పక్కన పెట్టారని మాత్రం అంటున్నారు. టిడిపి కూడా శిల్పా మోహన్ రెడ్డి కంటే జగన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది.