ఇక..ప్రత్యక్ష ఉద్యమంలోకి చంద్రబాబు: పోలీసుల ఆంక్షలున్నా: నేడు బస్సు యాత్రలో..!
మూడు రాజధానుల ప్రతిపాదన...అమరావతి నుండి పాలనా రాజధాని తరలింపు సిఫార్సులను వ్యతిరేకిస్తూ జరుగుతన్న పోరాటంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇక ప్రత్యక్షంగా తానే పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ప్రతీ రోజు ఒక కార్యాచరణ నిర్ణయించుకొని ముందకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. బుధవారం రాత్రి విజయవాడలో జరిగిని పరిణామాలు..చంద్రబాబుతో సహా పార్టీ...జేఏసీ నేతల అరెస్ట్ తరువాత టీడీపీ అధినేత మరో నిర్ణయం తీసుకున్నారు.
పోలీసులు ఆంక్షలు పెట్టినా ఉద్యమాన్ని ముందుకే తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోలీసులు అనుమతి నిరాకరించిన బస్సు యాత్రల ను జరిపాలని తీర్మానించారు. అయిదు బృందాలుగా జరిగే యాత్రలో..ఒక బృందంతో పాటుగా మచిలీపట్నం వెళ్లి అక్కడ సభలో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో..ఇప్పుడు పోలీసులు మరో సారి ఈ రోజు సైతం చంద్రబాబును అడ్డుకొనే పరిస్థితి కనిపిస్తోంది.
ఉద్యమంలోకి నేరుగా చంద్రబాబు
అమరావతికి మద్దతుగా ఇప్పటి వరకు దీక్షలు..పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇక స్వయంగా రంగంలో ఉండాలని డిసైడ్ అయ్యారు. జేఏసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్న ఆయన బుధవారం రాత్రి విజయవాడలో పోలీసులు బస్సు యాత్రలను అడ్డుకొనే విధంగా బస్సలను నిలిపివేయటంతో నిరసన వ్యక్తం చేసారు. చంద్రబాబుతో సహా బస్సుల వద్దకు వెళ్లాలని ముందుకు కదలిని జేఏసీ నేతలను అరెస్ట్ చేసారు. దీంతో..ఒక్క సారిగా ఉద్రిక్తత ఏర్పడింది. పెద్ద సంఖ్యలో నేతలు..కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఆ తరువాత పోలీసు వాహనంలోనే చంద్రబాబును తాడేపల్లి వద్ద ఆయన నివాసానికి తరలించారు.
పోలీసు ఆంక్షలున్నా బస్సుయాత్ర..
పోలీసు ఆంక్షలతో నిమిత్తం లేకుండా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు జరపాలని అమరావతి పరిరక్షణ జేఏసీ నిర్ణయించింది. బుధవారం రాత్రి పొద్దుబోయిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో వివిధ పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాలను ఐదు భాగాలుగా విభజించి ఐదు బృందాలను పంపాలని జేఏసీ నిర్ణయించింది. కాగా.. ప్రత్యమ్నాయం చూసుకొని గురువారం అన్ని జిల్లాలకు ఈ బృందాలను పంపాలని జేఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.ఒక బృందం గురువారం మచిలీపట్నంలో సభ నిర్వహించాల్సి ఉంది. దాని వెంట తానూ వెళ్లి మచిలీపట్నం సభలో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు.
ఉద్యమం తీవ్రతరం చేసేందుకేనా..
మూడు రాజధానుల ప్రతిపాదనల మీద ప్రభుత్వం ముందుకే వెళ్లాలని వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో..తానే ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనటం ద్వారా ప్రభుత్వానికి ఇరకాట పరిస్థితులు ఏర్పుడుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. దీని ద్వారా ఈ సమస్యను రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక, ఇప్పుడు బస్సు యాత్రలకు పోలీసులు ఆంక్షలు పెట్టినా..తానే స్వయంగా పాల్గొనా లని చంద్రబాబు నిర్ణయించటంతో..ఈ రోజు సైతం పోలీసులు చంద్రబాబును అడ్డుకొనే అవకాశం కనిపిస్తోంది. ఆయన్ను ఇంటి వద్దే నిలుపుదల చేస్తారా..లేక విజయవాడ దాటిన తరువాత అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తారా అనేది ఇప్పుడు టీడీపీలోనే చర్చ సాగుతోంది. జేఏసీ బస్సు యాత్రకు బ్రేక్ వేయడంపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది.