సీనియర్లకు చంద్రబాబు జలక్ - అదే చేస్తే టీడీపీ ప్రతిపక్షంలోనే : పార్టీ నేతలకు హెచ్చరిక...!!
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ల భవిష్యత్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన వచ్చే ఎన్నికలు - టిక్కెట్ల అంశం గురించి ప్రస్తావించారు. ఇకపై క్షేత్రస్థాయిలో పని చేయకుండా.. మాయ చేసే నేతలకు చెక్ పెట్టనున్నట్లు హెచ్చరించారు. కొంతమంది నేతలు క్షేత్రస్థాయిలో పని చేయకుండా... పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఇకపై అలాంటి నేతలకు కాలం చెల్లిందన్నారు. ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు తప్పించుకుంటున్నారో పర్యవేక్షించే మానిటరింగ్ వ్యవస్థ వచ్చిందన్నారు.

అలా చేస్తే టీడీపీ ప్రతిపక్షంలోనే
అదే సమయంలో...పార్టీలో సీనియర్లను గుర్తిస్తామని చెబుతూనే.. ఓటు వేయించలేని పరిస్థితి ఉంటే సీనియార్టీ ఉన్న ఏం లాభమని ప్రశ్నించారు. ఓట్లు వేయించలేని సీనియర్లు కూడా తమకే ప్రాధాన్యమివ్వాలని కోరితే.. టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందని వ్యాఖ్యానించారు. సీనియర్ నేతల వారసులే కాదు.. తటస్థులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు. పార్టీలో పనిచేసే యువ నేతలనూ గుర్తిస్తాం.. అవకాశాలిస్తామని హామీ ఇచ్చారు. సమాజ హితం కోసం తెదేపా అవసరం ఉంది... అందుకే విరాళాలు సేకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. పార్టీకి విరాళాలు వస్తే కొంతమందికైనా సాయం చేయవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

వారసులు-యువతకు ప్రాధాన్యత
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టీడీపీ బిగ్ డిబేట్ గా మారాయి. సీనియర్లు చాలా మంది పార్టీలో ఈ సారి టిక్కెట్లు ఆశిస్తున్నారు. వారిలో ఎవరికి చెక్ పెట్టబోతున్నారనేది ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలతో చర్చకు కారణమైంది. 2019 ఎన్నికల సమయంలోనే పలువురు సీనియర్ల వారసులు..ఎన్నికల బరిలో దిగారు. వారిలో ఎవరూ ఆ సమయంలో గెలుపొందలేదు. ఇక, ఇప్పుడు చంద్రబాబు..సీనియర్లు గెలిపించే వారు..గెలిచే వారికే ప్రాధాన్యత అనే అంశాన్ని తేల్చి చెప్పారు. అదే సమయంలో వారసులకు గుర్తింపు ఇస్తామని చెప్పటంతో..తమ స్థానంలో తమ వారసుకులను బరిలో దించేందుకు కార్యాచరణతో సిద్దం అవుతున్నారు.

సీనియర్లలో టిక్కెట్లు దక్కేదెవరికి..
పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పార్టీలో సుదీర్ఘ కాలం పని చేస్తున్న పలువురి నేతల వారసులు ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. వయోభారం..అనారోగ్య సమస్యలు..వారసత్వం కారణంగా వీరంతా ఇప్పటికే నియోజవకర్గాల్లో గుర్తింపు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలతో మరి కొంత మంది సీనియర్లు సైతం బరిలోకి తమ వారసులను దించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..టీడీపీలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు పొందే సీనియర్లు ఎవరు...దక్కని వారికి ఎటువంటి ప్రాధాన్యత పార్టీలో దక్కనుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications