మళ్లీ అధికారంలోకి వస్తాను : అమరావతి కాన్సెప్ట్నే చంపేసే పరిస్థితి : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఇంత కష్టపడితే.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అనే ఆలోచన తనను కలిచివేస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రివర్స్ పాలన చేస్తున్నారని ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఏపీలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. చెప్పారు. తాను ఆశా జీవిని.. అధైర్యపడకుండా ముందుకు సాగుతానని స్పష్టం చేసారు. తెలంగాణ ..ఏపీలో టీడీపీ శాశ్వతంగా ఉండాలని..అప్పుడే తెలుగు జాతికి మేలు జరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాడు హైదరాబాద్ లో తన విజన్ ఇప్పుడు అక్కడ ఊహించని విధంగా ఆదాయాన్ని తెచ్చి పెడుతోందని..అమెజాన్ లాంటి సంస్థ సైతం వచ్చిందని చెప్పుకొచ్చారు. దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి తెచ్చానని వెల్లడించారు.

మళ్లీ అధికారంలోకి వస్తాను..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన భవిష్యత్ రాజకీయాల మీద కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు తనపై నమ్మకంతోనే నవ్యాంధ్రకు సీఎంగా చేశారన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ తరహాలో అమరావతికి శ్రీకారం చుట్టామన్నారు. కానీ ఇప్పుడు అమరావతి డైలమాలో పడ్డాదని చెప్పారు. ఒక్క అవకాశం అంటూ అందలం ఎక్కి.. మూడు నెలల్లోనే ఏపీని అంధకారంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. ఏపీలో మిగులు విద్యుత్ తానిస్తే.. ఇప్పడు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. అమరావతి కాన్సెప్ట్నే చంపేసే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిస్తే.. వారి త్యాగాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. ఇంత కష్టపడితే.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అనే ఆలోచన వస్తుందని చెప్పుకొచ్చారు. జగన్ అమరావతిని దెబ్బ తీయడంతో ఇప్పుడు అందరూ హైదరాబాద్కు వలస వెళ్లిపోతున్నారని ఆరోపించారు. తాను తిరిగి అధికారంలోకి వస్తానంటూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. తాను ఆశా జీవినని...అధైర్య పడకుండా ముందుగా సాగుతానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేసారు.
Recommended Video

దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి తెచ్చాను..
రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. త్వరలో తెలంగాణలో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. తాను ముందు చూపుతో హైదరాబాద్ను అభివృద్ధి చేశానని చెప్పారు. హైదరాబాద్లో ఎయిర్పోర్టుకు అంత భూమి ఎందుకని ఎగతాళి చేశారన్నారు. కానీ ఇప్పుడు దేశంలోనే మంచి ప్రమాణాలు కలిగిన ఎయిర్పోర్టుగా పేరు గాంచిందని గుర్తుచేశారు. తాను చేసిన అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మారాయని స్పష్టం చేశారు. తాను ఏది చేసినా.. అది సమాజం కోసం.. భవిష్యత్ తరాల కోసమేనన్నారు. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీలు మొత్తం హైదరాబాద్కు వచ్చాయని పేర్కొన్నారు. దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి తెచ్చానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా కొనసాగిన ఏకైక నేతగా తనకు పేరుందన్నారు.

ఇక ఏపీలో నిరసనలకు పిలుపు..
ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి కావచ్చిందని..ప్రభుత్వం మీద ప్రజల్లో అసహనం పెరిగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే చంద్రబాబు ఇసుక కొరతను నిరసిస్తూ ఈ నెల 30న ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయితే, రాజధాని విషయంలో బీజేపీ దూకుడుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రాజధాని మీద స్పష్టత ఇవ్వలేదు. మంత్రులు మాత్రం భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చిన తరువాతనే అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications