వెనుకబడుతున్నారు - కీలక జిల్లా నేతలకు చంద్రబాబు హెచ్చరిక : వారసుడికి బాధ్యతలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు వరుసగా హెచ్చరికలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం ఆధారంగా పార్టీ నేతలతో సమీక్షిస్తున్నారు. టీడీపీకి తిరుగులేదని భావిస్తున్న ప్రాంతంలోనే పార్టీ నేతల తీరు పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెనుకబడిపోతున్నారంటూ హెచ్చరించారు.ఇప్పటి వరకు చంద్రబాబు 101 నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేసిన చంద్రబాబు..ఇప్పుడు వారసుల విషయంలోనూ కీలకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

గుంటూరు జిల్లా పార్టీ నేతలపైన ఆగ్రహం
తాజాగా టీడీపీ అధినేత ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేసారు. గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులతో సమావేశం నిర్వహించారు. పార్టీ నేతల తీరు పైన కఠినంగా మాట్లాడారు. పార్టీకి గట్టి పట్టున్న గుంటూరు జిల్లాలో నేతల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, అధికార పార్టీ వైఫల్యాలపై బలంగా పోరాడుతున్న వాతావరణాన్ని కల్పించలేకపోతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీనియర్ నేతలు కలిసి కట్టుగా పని చేయకపోతే, కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ఒక్క అంశం పైన అయినా కలిసి పోరాటం చేశారా అని ప్రశ్నించారు. వెనుకబడిపోతున్నారంటూ అప్రమత్తం చేసారు.

మారుతారా - మార్చమంటారా
ప్రభుత్వ తీరు పైన ప్రజల తరపున నిలబడటంలో విఫలమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఇన్చార్జులు ఇంకా ప్రజల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. ప్రజలతో మమేకం కాకుంటే నష్టం తప్పదని హెచ్చరించారు. పార్టీ శ్రేణుల పట్ల పోలీసులు ఎక్కడైనా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వారి పైన ప్రైవేటు కేసులు దాఖలు చేయాలని సూచించారు.
ఈ నెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఈ సమావేశంలో గుంటూరు జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో కార్యాచరణ కార్యక్రమం రూపొందించుకొంటామని, టీం వర్క్తో కలిసి పనిచేస్తామని ఆయనకు వారు చెప్పారు. త్వరలోనే జిల్లాలో పార్టీ అధినేత పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కోవూరులో వారసుడికి బాధ్యతలు
ఇక, నియోజకవర్గాల సమీక్షలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇన్చార్జిగా పోలంరెడ్డి దినేశ్ రెడ్డిని ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటివరకు శ్రీనివాసుల రెడ్డి ఆ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఇన్చార్జి పులవర్తి నాని, బాపట్ల ఇన్చార్జి వేగేశ్న నరేంద్ర వర్మతో కూడా చంద్రబాబు సమావేశయ్యారు.
అటు వారసుల టికెట్ల విషయం పైన వైసీపీలో చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు వారసులకు బాధ్యతలు ఖరారు చేయటం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. అదే సమయంలో టీడీపీకి బలమైన జిల్లాగా ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ నేతలకు చంద్రబాబు చేసిన హెచ్చరికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications