సీఎం జగన్కు అవగాహన లేదు: ఆయన మనస్తత్వం అలాంటిది: చంద్రబాబు ఫైర్
విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజ్ ఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. అక్కడ జరిగిన ప్రమాదం దురదృష్టకరం అని చెప్పారు. ఇక ప్రధాన మంత్రి మోడీ కూడా ఒక హైలెవెల్ మీటింగ్ పెట్టడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఇక తాను విశాఖకు రావాలని చాలా ప్రయత్నించినట్లు చంద్రబాబు చెప్పారు. ఇక తను విశాఖకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పిన చంద్రబాబు అనుమతి రాలేదని చెప్పారు. కరోనావైరస్ నిబంధనలు కఠినంగా ఉండటంతో వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
ఇక ప్రమాదం పై మాట్లాడిన చంద్రబాబు.. ఈ విషపూరిత రసాయనంపై పలువురి నిపుణుల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. కెమికల్ ఎఫెక్ట్తో రాత్రులు నిద్రలేకుండా అక్కడి స్థానికులు గడిపారని వెల్లడించారు. చాలా రోజుల తర్వాత కంపెనీని తెరుస్తున్నారని తెలిసి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో యాజమాన్యం విఫలమైందన్నారు చంద్రబాబు. స్టెరైన్ లీక్ అయినట్లు ఇంతకుముందు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవని చంద్రబాబు చెప్పారు. అయితే ఘటనపై బాధులు ఎవరు అనేది తేలాల్సి ఉందని చెప్పిన చంద్రబాబు ఇది సాంకేతిక సమస్యా లేక మానవ తప్పిదమా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు.
ఇక నిన్న జరిగిన ఘటనపై సీఎం జగన్ వ్యవహరించిన తీరుపై స్పందించారు చంద్రబాబు. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని చెప్పారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు బాధితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఘటన ఎంత సీరియస్గా ఉందంటే జాతీయ మానవహక్కుల సంఘంతో పాటుగా హైకోర్టు కూడా సుమోటోగా కేసును స్వీకరించింది. కానీ బాధితులను పరామర్శించిన సీఎం జగన్ ఘటనను చాలా తేలిగ్గా తీసుకున్నారని విమర్శించారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అధికారం ఉందని చెప్పిన చంద్రబాబు కేంద్రప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాల్సి ఉందని చెప్పారు.సాధారణంగా ఫ్యాక్టరీ కార్మికులు చనిపోతుంటారని చెప్పిన చంద్రబాబు.. ఈ ఘటనలో మాత్రం ఫ్యాక్టరీతో సంబంధం లేని వారు మృతి చెందారని గుర్తు చేశారు. జనసాంద్రత ఉన్న ప్రాంతంలో పాలిమర్స్ కంపెనీ ఉండటం సరికాదన్నారు.
Recommended Video
ఇక ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రబాబు. సీఎం జగన్కు అవగాహన లేదని నిప్పులు చెరిగిన చంద్రబాబు పలువురి నుంచి సలహాలు తీసుకునేందుకు ఆయన సిద్దంగా ఉండరని జగన్ది అలాంటి మనస్తత్వమని చెప్పారు. కేసు సీరియస్గా లేకుంటే హైకోర్టు ఎందుకు సుమోటోగా తీసుకుంది..? ప్రధాని ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఎందుకు నిర్వహించారు? జాతీయ మానవహక్కుల కమిషన్ ఎందుకు రియాక్ట్ అయ్యింది అని ప్రశ్నించారు చంద్రబాబు.