Chandra Babu: ప్రధాని మోదీ - షా తో చంద్రబాబు భేటీకి ఛాన్స్: రంగంలోకి సాయిరెడ్డి..!!
Chandra Babu Delhi Tour: ఏపీ రాజకీయాలు ఢిల్లీకి మారుతున్నాయి. సీఎం జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. ఇద్దరు కలిసి ఢిల్లీ కేంద్రంగా ఒకే వేదిక మీదకు వస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. అందునా ప్రధాని సమక్షంలో వీరిద్దరూ ఒకే సమావేశంలొ పాల్గొనటం మరింత ఇంట్రస్టింగ్ మారింది. ఇదే సమయంలో చంద్రబాబు కీలక అడుగు ఢిల్లీ కేంద్రంగా వేసేందుకు సిద్దమయ్యారు. రేపు ఢిల్లీలో ప్రధాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు భేటీకి ప్రయత్నిస్తున్నారు. కానీ, అక్కడ కొత్త రాజకీయ ట్విస్ట్ కనిపిస్తోంది.
ప్రధానితో చంద్రబాబు భేటీకి ఛాన్స్..
టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న తరువాత పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. మరో రెండు రోజుల్ల పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఎంపీలతో సభలో వ్యూహాల పైన చర్చించనున్నారు. సాయంత్రం ప్రధాని అధ్యక్షతన జీ20 అంశం పైన జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి అశోకా రోడ్ లోని నివాసంలో బస చేస్తారు. రేపు (మంగళవారం) ఢిల్లీలోనే ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రధాని మోదీ- కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీకి చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. నేడు గుజరాత్ లో రెండో విడత పోలింగ్ లో భాగంగా ప్రధాని మోదీ- అమిత్ షా అక్కడ ఓటు హక్కు వినియోగించుకొని ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ప్రధాని టీడీపీ అధినేత చంద్రబాబుకు సమయం కేటాయించే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
ప్రధానితో భేటీ కుదిరితే..ఏపీలో కీలక మలుపే
రానున్న ఎన్నికలకు సంబంధించి ఏపీలో ముందస్తుగానే కసరత్తు మొదలైంది. అటు సీఎం జగన్..ఇటు టీడీపీ చీఫ్ చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా 2014 ఎన్నికల పొత్తులను రిపీట్ చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. పవన్ కల్యాణ్ తో పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలోనే ప్రధాని విశాఖ పర్యటన సమయంలో జనసేనాని భేటీ కావటంతో మార్పు కనిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతలు మాత్రం పవన్ తమతోనే అని చెబుతూ..టీడీపీతో మాత్రం పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ప్రధానితో భేటీ ద్వారా 2019 ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు..టీడీపీ - బీజేపీ మద్య గ్యాప్ పైన చర్చించి..దానిని భర్తీ చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. తమతో నేరుగా పొత్తు లేకపోయినా.. వైసీపీకి ఎటువంటి మద్దతు ఢిల్లీ లేకుండా చేయాలనేది చంద్రబాబు లక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆశిస్తున్న విధంగా ప్రధాని అప్పాయింట్ మెంట్ ఖరారై..చర్చలు జరిగితే ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీయటం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ 2019 ప్లాన్ రిపీట్ - రంగంలోకి సాయిరెడ్డి
ఢిల్లీలో చంద్రబాబు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకుంటోంది. జనసేనతో చంద్రబాబు పొత్తు ఖాయమని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రధానితో మాత్రం తమ సత్సంబంధాలు కంటిన్యూ చేయాలని సీఎం జగన్ కోరుకుంటున్నారు. విశాఖ సభలోనే ప్రధానితో తమ సంబంధాలు రాజకీయాలకు అతీతమని సీఎం స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు ప్రధానితో చంద్రబాబు భేటీకి ప్రయత్నిస్తున్న వేళ..వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలోని కేంద్ర పెద్దలకె - వైసీపీకి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి ఈ సమయంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేలా వైసీపీ వేసిన ట్రాప్ లో చంద్రబాబు చిక్కారు. ఆ తరువాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో బీజేపీ ముఖ్యులతో మరింత గ్యాప్ పెరిగింది. ఇప్పుడు తిరిగి బీజేపీ అధినాయకత్వం తో చంద్రబాబు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాల వేళ ఢిల్లీ కేంద్రంగా వైసీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. చంద్రబాబు ప్రయత్నాలు చేసినా.. ప్రధాని ఈ సారి టీడీపీతో సంబంధాలకు మొగ్గు చూపరని వైసీపీ అంచనా. దీంతో, చంద్రబాబు ప్రయత్నాలు - వైసీపీ కౌంటర్ వ్యూహాలతో ఢిల్లీ కేంద్రంగా ఈ రోజు .. రేపు చోటు చేసుకొనే పరిణామాలపైన ఆసక్తి పెరుగుతోంది.