మమత, స్టాలిన్, విజయన్కు చంద్రబాబు ఫోన్- ఘనవిజయాలపై కంగ్రాట్స్
పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలో ఘనవిజయాలు అందుకున్న మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, పినరయి విజయన్లకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. నేరుగా వారికి ఫోన్ చేసి చంద్రబాబు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో పాటు ఆయన విడివిడిగా వారినుద్దేశించి ట్వీట్లు కూడా చేశారు.
పశ్చిమబెంగాల్లో బీజేపీని ఎదుర్కొని ఘన విజయం అందుకున్న మమతా బెనర్జీ, తమిళనాడులో బీజేపీ కూటమిని ఎదుర్కొని గెలిచిన స్టాలిన్, కేరళలో యూడీఎఫ్ కూటమిని ఎదుర్కొని అధికారం నిలబెట్టుకున్న పినరయి విజయన్కు చంద్రబాబు అభినందనలు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరంతా కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి గెలిచిన వారే. ఒకప్పుడు కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో పోటీ చేసిన చంద్రబాబు.. కేరళలో కాంగ్రెస్పై గెలిచిన విజయన్కు అభినందనలు చెప్పడం కూడా విశేషమే.
అటు అస్సోంలో గెలిచిన బీజేపీ సందర్భంగా సిట్టింగ్ సీఎం శర్భానంద్ సోనేవాల్ విజయంపైనా చంద్రబాబు ట్వీట్ పెట్టారు. తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ ఓటమిపాలైనా గెలిచిన నేతలకు అభినందనలు చెప్తూ ట్వీట్లు పెట్టిన చంద్రబాబు.. అదే తిరుపతిలో గెలిచిన వైసీపీకి మాత్రం అభినందనలు తెలపలేదు. ఉపఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన చంద్రబాబు... హైకోర్టులో పిటిషన్ కూడా వేసినా ఫలితం దక్కలేదు.