9 మంది అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సహజశైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయాలంటే మొహమాటాలను వదిలిపెట్టడంతోపాటు తనశైలిని మార్చుకోవాలంటూ కోరుతున్న పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు. అందుకే సీట్ల విషయంలో ఖరాఖండిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కోసం పనిచేయకపోతే సీటు లేదని వారికి ముఖంమీదే చెప్పేస్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగేదని స్పష్టం చేస్తున్నారు.
అపప్రథను తొలగించుకోవాలని..
మూడరోజుల క్రితం చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జులతో సమావేశమైన సంగతి తెలిసిందే. గతంలోసీట్ల కేటాయింపునకు సంబంధించి చివరి నిముషం వరకు తాత్సార ధోరణితో వ్యవహరించేవారన్న అపప్రథను ఆయన తొలగించుకోవాలనుకుంటున్నారు. చివర్లో సీటు ఇవ్వడంవల్ల ఆ అభ్యర్థికి ప్రచారం చేసుకోవడానికి, తగిన వ్యూహాలు రూపొందించుకోవడానికి అవకాశం ఉండదు. అంతిమంగా అభ్యర్థి ఓడిపోవడంతోపాటు పార్టీపై ప్రభావం చూపుతోంది. అందుకే ఈసారి ఆయన ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు.
9 మంది అభ్యర్థుల ఖరారు
కొన్ని బలమైన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలుగా కొనసాగుతున్నవారు అభ్యర్థులుగా వారే ఖరారయ్యే అవకాశం ఉంది. మరికొన్ని నియోజకవర్గాలకు ఇప్పటి నుంచే ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. రాజంపేట లోక్సభ కానీ, పత్తికొండ కానీ.. ఇలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అవనిగడ్డ స్థానం నుంచి మండలి బుద్ధప్రసాద్ తనయుడు పోటీచేస్తారని ప్రచారం నడుస్తున్నప్పటికీ వాటికి ఫుల్స్టాప్ పెడుతూ బుద్ధప్రసాదే రంగంలోకి దిగుతారని ప్రకటించారు.
పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, సంతనూతలపాడు నుంచి విజయ్కుమార్, మార్కాపురం నుంచి కందుల నారాయణరెడ్డి, రాజంపేట అసెంబ్లీ నుంచి బత్యాల చెంగల్రాయుడు, ఒంగోలు నుంచి దామచర్ల జానార్థన్, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ, పుంగనూరు నుంచి చల్లా రామచంద్రారెడ్డి, గుంటూరు తూర్పు నుంచి మహ్మద్ నజీర్ ఖరారయ్యారు.
సహజ ధోరణికి భిన్నంగా..
నందికొట్కూరు ఎస్సీ స్థానం కావడంతో అక్కడ బలమైన ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తున్నారు. బాధ్యతను గౌరు వెంకటరెడ్డికి అప్పగించారు. మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీ సీటు ఆశిస్తున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ తాను అక్కడి నుంచి ఓటమిపాలవడంవల్ల సానుభూతి ఉంటుందని, ఈసారి గెలుపొందడం సులువవుతుందని సుధాకర్ యాదవ్ అధినేతకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఏదేమైనప్పటికీ చంద్రబాబు తన సహజ ధోరణికి భిన్నంగా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తుండటం విశేషమే. తాజాగా పై 10 మందిని ఖరారు చేశారు. నియోజకవర్గాల నుంచి తెప్పించుకున్న సర్వే ప్రకారం లోటుపాట్లు చెప్పి వాటిని సరిచేసుకోవాలని, గెలుపు అభ్యర్థులుగా మారాలని సూచించారు.