2 కేజీల టమోటాలు కొన్న చంద్రబాబునాయుడు
జీవో నెంబరు 1 అమల్లోకి వచ్చిన తర్వాత తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు జరిపిన పర్యటన అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గడప గడపకు పాదయాత్ర నిర్వహించారు. తన వయసుకు మించి శ్రమిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని విధించుకున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని గుడుపల్లి మండలం సంగనపల్లిలో పర్యటన కొనసాగింది.
మార్గమధ్యంలో టామోటాలు అమ్మే బండి కనపడటంతో చంద్రబాబు అక్కడ ఆగి ఆ వ్యాపారి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక పరిస్థితి ఏమిటి? వ్యాపారం ఎలా జరుగుతుంది? ఆదాయం ఎంత వస్తోంది? చేతికి ఎంత మిగులుతోంది? తదితర వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు కోసం అక్కడికి వచ్చిన ప్రజలను చూసి ఆయన స్వయంగా ఆ వ్యాపారి దగ్గర రెండు కేజీలు టమోటా కొనుగోలు చేశారు. కేజీ వెయ్యి రూపాయల చొప్పున రూ.2వేలకు వాటిని కొనుగోలుచేసి ప్రజలకు పంచారు. టమోటాకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంవల్లే కొన్నిసార్లు రోడ్డుమీద పారబోయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
జీవో నెంబరు 1 ద్వారా చంద్రబాబునాయుడి రోడ్ షోలు, సభలను అడ్డుకోవడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. జీవో ద్వారా రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు నియోజకవర్గంలో తన పర్యటనను పాదయాత్రగా మార్చుకున్నారు. దీనివల్ల చంద్రబాబుకు సానుభూతి పెరిగిందని, ఆయనపై సానుభూతి పెరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications