1983 వ్యూహాన్ని మరోసారి అమలుచేయబోతున్న చంద్రబాబు?
వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే చంద్రబాబు గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దూకుడుగా రాజకీయం చేస్తుండటంతోపాటు యువతకు అత్యధిక ప్రాధాన్యత కల్పించబోతున్నారు. ఆయన తనయుడు లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి 4000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. సీనియర్ నేతలకు, లోకేష్ కు మధ్య "తరం" అంతరం కల్పిస్తుండటంతో పార్టీలోకి యువరక్తాన్ని ఎక్కించాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఎన్టీఆర్ యువతను తీసుకున్నట్లుగా..
యువనేతలైతే లోకేష్ కూడా సులువుగా కలుపుకుపోగలుగుతారని, పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న సీనియర్లవల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే సందిగ్ధంలో పడాల్సి వస్తోంది. 1983లో పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు అంతా యువతరాన్ని తీసుకున్నారు. సరిగ్గా ఇదే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో సీనియర్ నేతలమీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా తగ్గుతుందని, కొత్తరక్తాన్ని ఎక్కించడంద్వారా తెలుగుదేశం పార్టీని అధికారానికి ఎక్కించడం సులభమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న బాబు
నారా లోకేష్ నాయకత్వాన్ని బలపరిచేలా పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నల్లపురెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం ఆ పార్టీ హవా కొనసాగింది. అయితే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీకి వెళ్లడంతో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పార్టీ బరిలోకి దింపింది. 2014లో విజయకేతనం ఎగరవేసిన పోలంరెడ్డి 2019లో ఓటమిపాలయ్యారు.
బాధ్యతలను తన కుమారుడు దినేష్ రెడ్డికి అప్పగించారు. చంద్రబాబు కూడా నియోజకవర్గ ఇన్ చార్జిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డినే నియమించారు. రానున్న ఎన్నికల్లో దినేష్ రెడ్డి పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. నల్లపురెడ్డికి దినేష్ ఎంతవరకు చెక్ పెట్టగలరు? అనేది స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.

అధినేత నిర్ణయాన్ని గౌరవిస్తారా?
ఇప్పటికే పార్టీలో ఉన్న భూమా అఖిలప్రియ, పరిటాల శ్రీరామ్, కావలి గ్రీష్మ, రామ్మోహన్ నాయుడు, దినేష్ రెడ్డి తదితర యువ నేతలంతా లోకేష్ తో కలిసి పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా కలిసే పనిచేద్దామని లోకేష్ చెబుతుండటంతో ఆయనకు సన్నిహితంగా ఉండేవారందరికీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు లభిస్తాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. దీనివల్ల కొన్నిచోట్ల సీనియర్ నేతలను పక్కన పెట్టాల్సి వస్తోంది. తమను పక్కన పెట్టినందుకు వారంతా గౌరవంగా అధినేత నిర్ణయాన్ని సమర్థిస్తారా? లేదంటే రాజకీయలు చేస్తారా? అనేది చూడాలి మరి.












Click it and Unblock the Notifications