మోడీ బొమ్మలతో చంద్రబాబు ట్వీట్లు: కొత్త అర్థాలు: ఆ ఘనత తమదేనంటూ: 2024 నాటికి బీజేపీతో
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారా? ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ వైపు మరోసారి స్నేహహస్తాన్ని చాపే ప్రయత్నం చేస్తున్నారా? అంటే- అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
చంద్రబాబు వైఖరి కూడా దీన్ని బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకు ఒకట్రెండు సార్లు నరేంద్ర మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున బీజేపీతో జట్టు కట్టడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ఆరంభించారనీ అంటున్నారు.
మోడీకి ప్రశంసలు..
దేశ రక్షణ వ్యవహారాల్లో మోడీ ప్రభుత్వం అద్భుత పనితీరును కనపరుస్తోందని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏకంగా నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఆయన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలను గుప్పించారు. జగన్ సర్కార్పై చర్యలు తీసుకోవాలంటూ నరేంద్ర మోడీకి విజ్ఙప్తి చేశారు. అదే పరంపరలో మరోసారి చంద్రబాబు.. నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు. మోడీ ఫొటోలను ముద్రించిన కొన్ని స్లైడ్లను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)కి సంబంధించిన సమాచారంతో కూడుకున్న స్లైడ్లు అవి.
ఈఓడీబీ ఘనత తమదేనంటూ..
పెట్టుబడులు పెట్టడానికి అనువైన రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రగామిగా మారడానికి తమ ప్రభుత్వాలే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఘనతగా అభివర్ణించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి. మధ్యప్రదేశ్, జార్ఖండ్.. నాలుగైదు స్థానాలను ఆక్రమించుకున్నాయి. ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
చంద్రబాబు హయాంలోనే..
నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం, పారిశ్రామికంగా అద్భుత ప్రగతిని సాధించినట్లుగా గుర్తింపు పొందిన గుజరాత్.. ఈ జాబితాలో పదో స్థానానికి పరిమితమైంది. నిజానికి- చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఏపీ ఈఓడీబీలో అగ్రస్థానానికి ఎగబాకింది. 2018-19 మధ్యకాలంలో తొలి స్థానాన్ని సాధించింది. ప్రభుత్వం మారిన తరువాత కూడా ఏపీ అదే దూకుడును కొనసాగిస్తోంది. జోన్ల వారీగా చూసుకున్నా ఏపీ ఒక్కటే తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో దక్షిణాది జోన్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇదంతా తమ ప్రభుత్వ ఘనతేనని చంద్రబాబు పునరుద్ధాటించారు.
బీజేపీకి అనుకూల సంకేతాలు..
ఈఓడీబీ ఆధారంగా రాష్ట్రంలో ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం గొప్పవిషయమేనని చంద్రబాబు చెబుతున్నారు. నరేంద్ర మోడీ ఫొటోలు, ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో కూడుకున్న స్లైడ్లను చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేయడం పట్ల కొత్త అర్థాలు వెలువడుతున్నాయి. బీజేపీ పట్ల అనుకూలంగా ఉన్నామనే సంకేతాన్ని చంద్రబాబు ఇచ్చినట్టయిందని అంటున్నారు.
మోడీ గో బ్యాక్ అంటూ అప్పట్లో..
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు నరేంద్ర మోడీని టార్గెట్గా చేసుకుని భారీ ఎత్తున విమర్శలను గుప్పించారు. నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ పలుచోట్ల బ్యానర్లు కట్టారు. హోర్డింగులను నెలకొల్పారు. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు మోడీపై ఘాటు విమర్శలను సంధించారు. వ్యక్తిగత దాడికీ దిగారు. నరేంద్ర మోడీ-కేసీఆర్-వైఎస్ జగన్ త్రయాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు చెలరేగిపోయారు. ఆయన చేసిన ఆరోపణలతో అప్పట్లో రాజకీయాలు వేడెక్కాయి.
Recommended Video
కాంగ్రెస్తో జత కట్టినా..
ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తరువాత చంద్రబాబు.. కాంగ్రెస్తో జత కట్టారు. అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీతోనూ భేటీ అయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేశారు. చేదు ఫలితాలను చవి చూశారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. సార్వత్రిక ఎన్నికల తరువాత నరేంద్రమోడీ మరోసారి తిరుగులేని నేతగా ఆవిర్భవించడతో బీజేపీ వైపు చంద్రబాబు చూపులు సారించారంటూ ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలను నిజం చేసేలా చంద్రబాబు తాజాగా ట్వీట్లను చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది.