ఇంకో 15 ఏళ్లు బతుకుతానేమో.. బుద్ధి ఉన్నోళ్లెవరూ ఆ పని చేయరు: చంద్రబాబు
ప్రజలే దేవుళ్లుగా, సమాజమే దేవాలయంగా భావించే తాను జీవితంలో ఏనాడూ పదవుల కోసం ఆశపడలేదని, ఇకముందు కూడా ఆశపడబోనని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. మూడు రాజధానుల అంశంపై మంగళవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై, నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహణపైనా ఆసక్తికర కామెంట్లు చేశారు.

నా బాధంతా అదే..
వయసు 70 ఏళ్లు నిండియా, మానసికంగా తానింకా యువకుడిలానే ఆలోచిస్తానని గతంలో చెప్పిన చంద్రబాబు మరోసారి ఆ ప్రస్తావన తీసుకుకొస్తూ.. ప్రస్తుతానికి ఆరోగ్యం చాలా బాగుందని, ఏ ఇబ్బందులు రాకుంటే మరో 15 ఏళ్లు బతుకుతానేమోనని అన్నారు. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్న ఆయన.. తన బాధంతా రాష్ట్రం గురించేనని, జగన్ పరిపాలన చూస్తున్నప్పుడు ఏపీ భవిష్యత్తు ఏమైపోతుందోననే వేదన కలుగుతుందని చెప్పారు.

అదే మా ఊరు..
మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో అధికార వైసీపీ బహిరంగ సభ నిర్వహించడం, దానికి ఆశించమేరకు జనం రాకపోవడంపై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. నారావారిపల్లెలోనేకాదు.. రాష్ట్రంలో ఏ మూలనైనాసరే బుద్ధి ఉన్నోళ్లెవరూ మూడు రాజదానుల్ని సమర్థించరని, అమరావతిని దాటి వైజాగ్ దాకా పోవాలని ఎవరూ అనుకోరని, అలాంటప్పుడు సభలు పెడితే జనం ఎందుకువస్తారని ఆయన వైసీపీని ప్రశ్నించారు.

అమరావతిపై ప్రజాఉద్యమం..
రాజధాని రైతులు చేస్తోన్న నిరసనలకు మిగతా ప్రాంతాల ప్రజలు కూడా మద్దతు పలకాలని, సేవ్ అమరావతిని ప్రజా ఉద్యమంగా మలుచుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ సీఎం పదవి చేపట్టిన తర్వాత అన్నీ రివర్స్ నిర్ణయాలే తీసుకుంటున్నారని, ప్రజలంతా అప్రమత్తమై ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications