చంద్రబాబుకు మరో షాక్-క్రిస్టియన్ సెల్ మూకుమ్మడి గుడ్బై - హిందూత్వ అజెండాపై నిరసన
ఏపీలో దాదాపు రెండేళ్ల క్రితం వైసీపీకి అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి దూరమవుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీలోని ఇతర మతాల నేతలకు కంటగింపుగా మారుతున్నాయి. దీంతో తాజాగా వారంతా పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల సునీత-బీఫారం ఇచ్చిన సీఎం జగన్- కొత్త రాజకీయం
టీడీపీ అధినేత తాజాగా హిందుత్వకు అనుకూలంగా, మతమార్పిళ్లతో పాటు క్రిస్టియన్లకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీకి చెందిన మాజీ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ టోచర్ ఇప్పటికే గుడ్బై చెప్పేశారు. ఇవాళ పార్టీ క్రిస్టియన్ సెల్కు చెదిన నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించారు. దీంతో పార్టీలో క్రిస్టియన్ నేతలంతా వైదొలిగినట్లయింది. చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసిన నేతలు టీడీపీకి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీలో ఎంతో కాలంగా ఉండి పనిచేస్తున్నామని, ఈ నెల 5వ తేదీన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమనెంతో బాధించాయని టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ తెలిపారు. క్రైస్తవ సమాజాన్ని అవమానించే విధంగా చంద్రబాబు మాట్లాడారని, గతంలో ఎప్పుడూ ఆయన ఇలా వ్యవహరించలేదన్నారు. చంద్రబాబు మాటలతో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. గతంలో చంద్రబాబు కూడా చర్చిలకు వెళ్లి అనేకసార్లు ప్రార్ధనలు చేశారని ప్రవీణ్ గుర్తుచేశారు. మసీదులకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పలేదా అని ప్రశ్నించారు.
అన్నిపండుగల్లో పాల్గొంటూ చర్చి ఫాదర్లకు ఐదు వేల రూపాయలు ఇస్తే తప్పుబట్టడం దేనికని క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ ప్రశ్నించారు. టీడీపీ మ్యానిఫెస్టోలో కూడా అనేక పథకాలు పెట్టారని, తమ మార్పిళ్ల విషయంలోనూ క్రిస్టియన్లను అవమానించారని ప్రవీణ్ గుర్తు చేశారు. బలవంతంగా మతమార్పిళ్లు జరుగుతున్నట్లు చంద్రబాబు నిరూపించాలన్నారు. గ్రామాల్లో చర్చిలు ఎప్పటినుంచో ఉన్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పడం సరికాదని ప్రవీణ్ తెలిపారు. గతంలో క్రైస్తవులకు ఇచ్చిన హామీలు మీరెందుకు అమలు చేయలేదని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, అందుకే మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామన్నారు.