కెసిఆర్ చుట్టూ టిడిపి కోటరీయే, ఎర్రగడ్డకు పంపే టైమ్: రేవంత్ రెడ్డి
మహబూబ్నగర్: తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి కుంటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను ప్రజలు ఎర్రగడ్డకు పంపే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడం కేసీఆర్ తరం కాదన్నారు. తమ పార్టీ నాయకులను తయారు చేసే పార్టీ అని, కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ అంతా టీడీపీ నేతలేనని అన్నారు.
టీఆర్ఎస్లోకి వెళ్లిన నాయకులు రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. సోమవారం నాడు జిల్లాలోని దేవకర్రలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు రేవంత్ రెడ్డి, శోభారాణి, తదితర నేతలు హాజరయ్యారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులు ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని దయాకర్ రావు అన్నారు. గ్రెటర్ హైదరాబాద్లో టీడీపీదే ఆధిపత్యమని, అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో మహిళా సంఘాలకు ప్రాధాన్యత కల్పించాలని మరో నాయకురాలు శోబారాని డిమాండ్ చేశారు.
మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకపోవడం ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గపు చర్యలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.