‘ఎందుకీ గోల.. ఎవరూ వినడం లేదు: ఏపీ ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం, ‘టీవీ లైవ్ కట్’
న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాజ్యసభలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన రాజ్యసభ సమావేశాల్లో టీడీపీ, వైసీపీ ఎంపీలో ఏపీకి న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారించినా టీడీపీ, వైసీపీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ ఎంపీలో వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఏపీ సమస్యలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు కూడా హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

ఆందోళన విరమించి సభ సజావుగా సాగేలా సహకరించాలని వెంకయ్యనాయుడు ఏపీ ఎంపీలను కోరారు. అయినా, ఎంపీలు మాత్రం వినకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో వెంకయ్యనాయుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

'మీ గోల ఎవరూ వినడం లేదు. చూడటం లేదు. ఇంకా ఎందుకు అరుస్తారు' అంటూ టీడీపీ, వైసీపీలపై వెంకయ్య మండిపడ్డారు. వెంటనే టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు కొద్దిసేపు ఆపారు. ఎంపీల ఆందోళనలు కొనసాగడంతో రాజ్యసభను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, విభజన హామీలపై మంగళవారం స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications