నిద్రపోనని చంద్రబాబు, మీ ఊరికే తీసుకొస్తానని జగన్
మీరు వినతి పత్రాలు ఇవ్వడం కాకుండా సంతకాలు చేసే రోజులు రావాలన్నారు. బిసిల్లో ఐకమత్యం వస్తేనే రాజ్యాధికారం అందుతుందని, దానికి ఈసారి ఎన్నికల్లో ఓటును ఒక ఆయుధంగా చేసుకొని పోరాడాలని కోరారు. టిడిపిది బిసి ఎజెండా అని, తమ పార్టీకి బిసిలు వెన్నెముక అన్నారు. బిసిలు లేకుండా టిడిపి లేదని, వారి రుణం తీర్చుకోవడానికి తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి బిసిలకు ఇస్తామన్నారు.
తన రామబాణంతో అన్ని పార్టీలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, కెసిఆర్ నోటి వెంట ఏనాడూ బిసి అన్న పదమే రాదని, ఆయనకు వారంటేనే ఎలర్జీ అని, తెలంగాణ రాదనుకొని దళితుడిని ముఖ్యమంత్రిగా, మైనారిటీని ఉప ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటనలు చేశారని, తెలంగాణ వచ్చేసరికి మాట మార్చారని దుయ్యబట్టారు. కెసిఆర్ది కుటుంబ ఎజెండా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ ఎజెండా లేదని, ఎన్నికల తర్వాత ఆ పార్టీ అడ్రస్ కూడా ఉండదని వ్యాఖ్యానించారు.
విహెచ్ వంటి కాంగ్రెస్ నేతలు తనపై పడుతున్నారని, వారికి చేతనైతే బిసిలకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని సోనియాను నిలదీయాలని సవాల్ చేశారు. ప్రపంచాన్ని శాసించే శక్తి యువతకే ఉన్నదని చంద్రబాబు అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో యువతకు నష్టం జరిగిందని, చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగాలు రావడం లేదన్నారు. మన వాళ్లకు తెలివితేటలు ఉన్నాయని, అవకాశమిస్తే తన కన్నా బాగా పని చేయగల సత్తా ఉందన్నారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, నేత షర్మిలలు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతలో విజయమ్మ, నెల్లూరులో షర్మిల, తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెసు, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అబద్దాల కోరు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలకే తెస్తామని జగన్ తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు.
జగన్ పార్టీలోకి ముత్యాల పాప
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాల పాప బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జగన్ సమక్షంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.