బిజెపి బలపడడం టిడిపి జీర్ణించుకోవడం లేదు, సీట్లిచ్చి ఓడిస్తున్నారు: సోము వీర్రాజు సంచలనం
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి బలోపేతం కావడాన్ని టిడిపి జీర్ణించుకోలేక పోతోందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు.ఏపీలో బలోపేతం కావడం జాతీయ పార్టీ ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.తమను ఎదగకుండా టిడిపి ప్రయత్నాలు చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.
ఇటీవల కాలంలో బిజెపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే టిడిపిపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.దీనికి కౌంటర్గా టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బిజెపిపై రెచ్చిపోయారు.
అయితే పార్టీ అనుమతి లేకుండా బిజెపిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. అయితే ఈ ఆదేశాలను కాదని టిడిపి ఎమ్మెల్సీ జగదీష్ బుదవారం నాడు బిజెపిపై నిప్పులు చెరిగారు. దీనికి కౌంటర్గా సోము వీర్రాజు గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు.
బిజెపి బలోపేతం కావడం టిడిపి జీర్ణించుకోవడం లేదు
ఏపీ రాష్ట్రంలో బిజెపి బలోపేతం కావడాన్ని టిడిపి జీర్ణించుకోవడం లేదని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఏపీలో బలపడేందుకు జాతీయ పార్టీ సూచనలతో తాము ప్రయత్నాలు చేస్తున్నామని వీర్రాజు చెప్పారు.పార్టీ బలోపేతం కావాలనేది స్వాభావిక లక్షణమన్నారు. కానీ, తమ ఎదుగుదలను టిడిపి తట్టుకోవడం లేదన్నారు. అందుకే తమను అడుగడుగునా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని వీర్రాజు నిప్పులు చెరిగారు.
ప్రత్యేక హోదాను పదే పదే తెరమీదికి తెస్తున్నారు
తాము బలపడుతున్న ప్రతి సమయంలో ప్రత్యేక హోదాను తెరపైకి తెస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబునాయుడు స్వాగతించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హోదా ఇస్తే ఏటా రూ.3వేల కోట్ల చొప్పున రూ.15వేల కోట్లే వచ్చేవని.. కానీ ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.2లక్షల 10వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంట్ ఉండేది కాదని, తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కరెంట్ పోలేదని చెప్పారు.
సీట్లిచ్చి ఇండిపెండెంట్లు
తమకు సీట్లు ఇవ్వడమే కాదు ఆ సీట్లలో ఇండిపెండెంట్లను బరిలోకి దింపి తమ గెలుపును అడ్డుకొంటున్నారని సోము వీర్రాజు చెప్పారు. 2014 ఎన్నికల్లో తమకు 14 అసెంబ్లీ సీట్లిచ్చారు. 4 చోట్ల మాత్రమే నెగ్గేలా చేశారని వీర్రాజు గుర్తు చేశారు. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడ 9 డివిజన్లను కేటాయించి 4 చోట్ల గెలిచేలా చేశారని చెప్పారు. తమకు కేటాయించిన సీట్లలో ఇండిపెండెంట్లను బరిలోకి దింపారని చెప్పారు. గెలిచిన తర్వాత ఇండిపెండెంట్లను పార్టీలో చేర్చుకొన్నారని వీర్రాజు ప్రస్తావించారు.
19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం
19 రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో ఉందని సోము వీర్రాజు గుర్తు చేశారు. తమిళనాడులో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని టిడిపి ఎమ్మెల్సీ జగదీష్ చేసిన విమర్శలపై వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబునాయుడు మద్దతుతో గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలైన సందర్భంలో డిపాజిట్ కూడ కోల్పోయారని ఆ విషయాలను తాము ఏనాడూ ప్రస్తావించలేదని వీర్రాజు చురకలంటించారు.
హైద్రాబాద్ తరహ అభివృద్ది వద్దు
హైద్రాబాద్ తరహ అభివృద్ది వద్దని చంద్రబాబునాయుడుకు సోము వీర్రాజు సూచించారు. అమరావతి అభివృద్ది కూడ హైద్రాబాద్ తరహ అభివృద్ది మాదిరిగానే ఉందన్నారు. దీని వల్ల ఏపీకి నష్టం జరుగుతోందన్నారు. రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాల్లో కూడ అభివృద్దిని వికేంద్రీకరణ జరిగేలా చూడాలని వీర్రాజు ప్రభుత్వానికి సూచించారు.పోలవరం ప్రాజెక్టకు తరహలోనే ఇతర జిల్లాల్లోని ప్రాజెక్టులను కూడ త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీర్రాజు సూచించారు.
1998లో 18 శాతం ఓట్లు
ఏపీ రాష్ట్రంలో 1998లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే 18 శాతం ఓట్లు వచ్చాయని సోము వీర్రాజు గుర్తు చేశారు. 4 ఎంపీ సీట్లను కైవసం చేసుకొన్నట్టు చెప్పారు. 51 అసెంబ్లీ స్థానాల్లో బిజెపికి మంచి ఓట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం 1999- 2004 తరహలో తాము నడవడం లేదని చెప్పారు. 2018లోకి వెళ్తున్నామన్నారు.