ధర్మాన డైరెక్టర్ అయితే.. బాహుబలిని తలదన్నే సినిమా తీస్తాడు : జలీల్ ఖాన్ సెటైర్స్
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావుపై టీడీపీ నేత జలీల్ ఖాన్ సెటైర్స్ వేశారు. ధర్మాన డైరెక్టర్ అయితే బాహుబలిని మించిన సినిమా తీస్తాడని ఎద్దేవా చేశారు. చట్ట సభల్లో వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రుల వ్యవహారాన్ని చూస్తుంటే బీపీ పెరుగుతోందన్నారు. రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. రెండు రోడ్లు ఉన్న విశాఖలో తాగేందుకు నీళ్లు కూడా లేవన్నారు.
జగన్ వల్లే రాష్ట్రం విడిపోయింది : జలీల్
రాజధానిని మార్చాలని ప్రభుత్వం భావిస్తే సరిపోదని,కోర్టులు కూడా ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలని జలీల్ ఖాన్ పేర్కొన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు ద్వారా కొత్తగా సాధించేది ఏమి ఉండదన్నారు. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ.. అప్పట్లో రెడ్లకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆ సామాజిక వర్గానికి ఇంకెన్నాళ్లు సేవ చేయాలని వ్యాఖ్యానించారన్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ ఓదార్పు యాత్రలు చేయడం వల్లే రాష్ట్రం విడిపోయిందని విమర్శించారు.
ధర్మాన ఏమన్నారు..
శాసనమండలిని సాక్షాత్తు మహాత్మాగాంధీ వ్యతిరేకించారని శాసనమండలిలో ధర్మాన వ్యాఖ్యానించారు. అసలు శాసనమండలి సభను తీసుకొచ్చింది బ్రిటీష్ వారని.. కేవలం వారి స్వప్రయోజనాలను కాపాడుకునేందుకే ఆ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. శాసనమండలి వ్యవస్థ ఒక విఫల ప్రయోగంగా నిలిచిపోయిందని.. కాబట్టి దీన్ని రద్దు చేయడంలో తప్పు లేదని అన్నారు.
సీఆర్డీఏ బిల్లుపై ఒకే ఒక్కరోజు చర్చ..
ప్రజల చేత తిరస్కరించబడినవారు శాసనమండలిలో కూర్చుని ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపడటం సరికాదన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్ చట్టవిరుద్దంగా వ్యవహరించి.. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారని అన్నారు. టీడీపీ హయాంలో 171 పేజీల సీఆర్డీఏ బిల్లుపై ఒకే ఒక్క రోజు చర్చ జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడేమో కేవలం 12 పేజీలతో కూడిన మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారని ధర్మాన తప్పు పట్టారు.
మండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం..
ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి రద్దుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా మద్దతుగా 133 ఓట్లు వచ్చాయి. నిబంధనల ప్రకారం తీర్మానం పాస్ కావాలంటే.. అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మంది శాసనమండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేయాలి. అనుకూలంగా అంతకంటే ఎక్కువమందే ఓటేయడంతో తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు.