TDP ఓడిపోయే నియోజకవర్గాలు?
వచ్చే ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా అధికారంలోకి రావల్సిన పరిస్థితి. పార్టీకి రెండో ఆప్షన్ కూడా లేదు. ఇటువంటి తరుణంలో అధినేత చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గతానికి భిన్నంగా ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు 126 నియోజకవర్గాల సమీక్ష పూర్తిచేసి రికార్డు సృష్టించారు. తాజాగా ఆయన జిల్లాల పర్యటన చేపట్టారు.

అధినేత కష్టమేకానీ.. నాయకులు మాత్రం..!!
అధినేత పార్టీకోసం ఇంత కష్టపడుతున్నప్పటికీ తెలుగు తమ్ముళ్లు మాత్రం 'ఉయ్యాలా.. జంపాలా.'. అంటూ పాటలు పాడుకునే స్థితిలో ఉన్నారు. చంద్రబాబు మాటను పెడచెవిన పెడుతున్నవారిపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నది బాబు త్వరలోనే ప్రకటించబోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను నియమించలేదు. నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన నాయకులు చంద్రబాబు వచ్చినప్పుడు మాత్రమే పర్యటనల్లో పాల్గొంటూ మిగతా సమయాల్లో ముఖం చాటేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ, సమస్యలను ప్రస్తావిస్తూ ఉండాల్సిన నాయకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ఒకరికి ముగ్గురు పోటీపడుతున్నారు!
రాష్ట్రవ్యాప్తంగా ఇన్ ఛార్జిలు లేని నియోజకవర్గాలతోపాటు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఒకరికి ముగ్గురు పోటీపడుతున్న పరిస్థితులున్నాయి. ఇటువంటివాటి విషయంలో నాన్చుడు ధోరణి వద్దని, వెంటనే తేల్చేయాలంటూ తెలుగు తమ్ముళ్ల అధినేతను డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి సీటును ముగ్గురు ఆశిస్తున్నారు. ఇన్ చార్జి ప్రకటనకే ఇక్కడి నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇన్ ఛార్జి ప్రకటనను చంద్రబాబు వాయిదా వేశారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికలకుముందు.. ఎన్నికల తర్వాత ఇదే పరిస్థితి. నాయకులు మాత్రం మారడంలేదు. వారం రోజులక్రితమే ఇక్కడి నాయకులు కుర్చీలు గాల్లోకి ఎగరేసి మరీ కొట్టుకున్నారు. ఈ సీటును ముగ్గురు ఆశిస్తున్నారు.

శ్రేణుల్లో తీవ్ర గందరగోళం!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో మూడు గ్రూపులున్నాయి. ఇక్కడి నాయకుల వైరం కారణంగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. అధిష్టానం కూడా స్పష్టతకు రాలేకపోతోంది.అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇప్పటికే ఇద్దరు నేతలు తన్నుకుంటున్నారు. తాజాగా మరో నేత తెరపైకి రానున్నారంటూ ప్రచారం నడుస్తోంది. మైదుకూరులో పుట్టాకా? డీఎల్ కా? ఏమీ తేల్చలేకపోతున్నారు చంద్రబాబు. డోన్ లో కేఈ వర్గం బలంగానే ఉన్నప్పటికీ ధర్మవరం సుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ గ్రూపు తగదాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరు, తిరువూరు, గోపాలపురం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, గుంటూరు పశ్చిమ, అనకాపల్లి, ఉదయగిరి, కావలి, దర్శి, నగరి తదితర నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాల కారణంగా తాము ఓడిపోతామని తెలుగు తమ్ముళ్ల ముందే చెప్పేస్తున్నారు. ఇటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారో వేచిచూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications