క్యాసినో రగడ: గుడివాడకు టీడీపీ బృందం; కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీశ్రేణులు; భారీగా మోహరించిన పోలీసులు
గుడివాడ క్యాసినో వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చోటు చేసుకున్న గుడివాడ క్యాసినో వ్యవహారంలో,కొడాలి నాని, వల్లభనేని వంశీ, ప్రవీణ్ చికోటిలను తప్పించే ప్రయత్నం వైసిపి ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడు రోజులైనా ఎందుకు చర్యలు లేవు అంటూ ప్రశ్నిస్తున్నారు.
గుడివాడ క్యాసినో వ్యవహారం నిగ్గు తేల్చనున్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ
గుడివాడ క్యాసినో వ్యవహారంపై గుడివాడ లో ఏం జరిగింది అనేది పరిశీలించడానికి తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ ని ఏర్పాటు చేసి గుడివాడ క్యాసినో ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చనున్నారు.
తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ లో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వర రావు, తంగిరాల సౌమ్య కమిటీ సభ్యులుగా ఉన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడ లో పర్యటించి పూర్తి వివరాలను సేకరించి క్యాసినో వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదికను పార్టీకి అందిస్తుందని వారు వెల్లడించారు ఇక ఈ ఆరుగురు సభ్యుల కమిటీని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ సమన్వయం చేస్తారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
గుడివాడలో టీడీపీ బృందం పర్యటనతో టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
ఇదిలా ఉంటే ఏపీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన కృష్ణాజిల్లా గుడివాడలో శుక్రవారం నాడు టిడిపి నిజ నిర్ధారణ కమిటీ పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. గుడివాడలో భారీగా పోలీసులు మోహరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల నిజ నిర్ధారణ కమిటీని శుక్రవారం నాడు గుడివాడకు పంపుతున్నారు. ఇప్పటికే గుడివాడకు నిజ నిర్ధారణ కమిటీ బయలుదేరగా, కొడాలి కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు వస్తే వారిని నిలువరించేందుకు వైసీపీ శ్రేణులు భారీగా రంగంలోకి దిగుతున్న ట్లుగా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తుంది.
టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణకు ఛాన్స్ .. టీడీపీ నేతలకు అనుమతిపై అనుమానం
అయితే వైసిపి టిడిపి నేతల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన రహదారిపై బారికేడ్లను పెట్టారు. రోప్ పార్టీని రంగంలోకి దించారు. డీఎస్పీ సత్యానందం నేతృత్వంలో గుడివాడ నెహ్రూచౌక్, నియోజకవర్గంలోని టిడిపి కార్యాలయం వద్ద పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ బృందానికి పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరోవైపు గుడివాడకు చెందిన మంత్రి కొడాలి నాని ఈరోజు క్యాబినెట్ భేటీలో పాల్గొనడానికి అమరావతికి వెళ్లారు.
ఏపీలో సంక్రాంతి క్యాసినో రచ్చ .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో, కోడి పందాలు, పేకాట శిబిరాలు, గుండాట నిర్వహించినట్లుగా తెలుస్తుంది. బౌన్సర్ లను ఏర్పాటు చేసుకొని క్యాసినో నిర్వహించినట్టు, 10000 చెల్లిస్తేనే క్యాసినో లోకి నిర్వాహకులను అనుమతించారని ఆరోపణలు కూడా వెల్లువగా మారాయి. ఇక దీనిపై తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీని, మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.