కేశినేని నాని అవిశ్వాస తీర్మానం నోటీసు, పురంధేశ్వరి అన్యాయం చేశారని వ్యాఖ్య
న్యూఢిల్లీ: కేంద్రంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని మంగళవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోకసభ సెక్రటరీ జనరల్కు లేఖ రాశారు. బుధవారం జరిగే సభా కార్యక్రమాల జాబితాలో అవిశ్వాస తీర్మానం అంశాన్ని చేర్చాలని కోరారు. దీనిపై ఆయన వివిధ మీడియా ఛానళ్లతో మాట్లాడారు.
అవిశ్వాస తీర్మానం నోటీసును తిరస్కరిస్తే సభను స్తంభింప చేస్తామని ఆయన హెచ్చరించారు. ఏపీకి చేసిన అన్యాయం బయటపడుతుందనే బీజేపీ చర్చకు వెనుకాడుతోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు ఏపీ డిమాండ్లకు మద్దతిస్తున్నాయని చెప్పారు.
జగన్ అజెండా ప్రజలకు మేలు చేయాలని కాదన్నారు. కేసుల నుంచి బయటపడటమే ఆయన ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. అందుకే బీజేపీతో ఆయన కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్నట్లుగా ఆడుతున్నారని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వచ్చి ఏపీలో కూర్చున్నా ఆ పార్టీకి తెలుగు ప్రజలు ఓటు వేయరని చెప్పారు. వరుసగా కేంద్రమంత్రులు ఏపీ పర్యటనకు వచ్చినా బీజేపీని ప్రజలు ఆదరించరని చెప్పారు. కేంద్రంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిందన్నారు. ఎన్నికలు రాని సమయం చూసి రాజీనామాలు చేశారన్నారు.
టీడీపీ బట్టలు ఊడదీసి కొడతామన్న ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై కేశినేని నాని ఘాటుగా స్పందించారు. కన్నా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. తీర్మానాన్ని చర్చకు అనుమతిస్తే బీజేపీ బట్టలు విప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కన్నా, దగ్గుబాటి పురంధేశ్వరిలు ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications