వెనుక వాళ్లే: నారాయణ, సభ నుంచి రైలు పట్టాలపైకి ముద్రగడ, రైలింజన్ ధ్వంసం.. ఉద్రిక్తత
విజయవాడ: కాపులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి నారాయణ చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చుతుందని చెప్పారు. కాపు సభను వైసిపి, కాంగ్రెస్ పార్టీలే నడిపిస్తున్నాయని ఆదివారం ఆయన ఆరోపిచారు.
కాపు కమిషన్తో పాటు ప్రత్యేక కాపు కార్పోరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాలంలో కాపులకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి నారాయణ డిమాండ్ చేశారు.
బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి ముద్రగడ!
కాపు గర్జన సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. కాపులను బీసీల్లో చేర్చే వరకూ తమ ఉద్యమం ఆగదని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం అన్నారు. ఇందుకు సంబంధించిన రెండు జీవోలను ఇచ్చే వరకూ రైల్ రోకోలు, రాస్తారోకోలతో స్తంబింపజేద్దామని, ఉద్యమ కార్యాచరణను తక్షణం అమలు చేద్దామన్నారు.
బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళదాం.. పదండంటూ ముద్రగడ సదస్సుకు హాజరైన వారికి పిలుపునిచ్చారు. సంబంధిత జీవో విడుదలయ్యే వరకూ ఇంటికి వెళ్లమని, ఈ ఉద్యమంలో తనతో పాటు తన కుటుంబం పాల్గొంటుందని, ఇళ్లల్లో ఉన్న పెద్దలు కూడా రోడ్లపైకి రావాలని, రిజర్వేషన్ల కోసం గళం విప్పాలన్నారు. ముద్రగడతో పాటు వందలాది మంది కులస్తులు, రాజకీయ నాయకులు, తదితరులు సభా స్థలం నుంచి హైవే, రైల్వే ట్రాక్లను దిగ్బంధించేందుకు బయలుదేరి వెళ్లారు.
జగన్ నీతిపరుడైతే వైసిపికి ఉలుకెందుకు: ఆనం వివేకా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నీతిపరుడు అయితే వైసిపికి ఉలుకు ఎందుకని టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి ప్రశ్నించారు. జగన్ అవినీతిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయన్నారు.
భువనేశ్వరి ఓటుపై పీతల సుజాత
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నారా భువనేశ్వరి తెరాసకు ఓటు వేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి పీతల సుజాత విజయవాడలో అన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. అదికారంలోకి వచ్చాక హైదరాబాదుకు కెసిఆర్ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
రైలు బోగీలపై 'కాపు' ఆందోళనకారుల దాడి
తుని రైల్వే స్టేషన్ సమీపంలో కాపు గర్జన కార్యకర్తలు ఆందోళనతో ఉద్రిక్తతకు దారి తీశాయి. రత్నాచల్ ఎక్స్ప్రెస్ పైన రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రైలు ఇంజిన్ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో నలుగురు రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడితో రైల్వే సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కోల్కతా-చెన్నై జాతీయ రహదారిపైకి కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో నిలిచిపోయాయి.