తెలుగుజాతి సత్తా...ఆంధ్రా ప్రజల దమ్ము దేశానికి చాటిన ఘనత టీడీపీదే:మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ:తెలుగుజాతి సత్తా ఏంటో...ఆంధ్ర రాష్ట్ర ప్రజల దమ్ము ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వపటిమ ద్వారా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అటు దేశమంతటికీ తెలిసే విధంగా టిడిపి పోరాటం చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
విజయవాడ టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకుండా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఇంటి దగ్గర కూర్చోవడమే కాకుండా టిడిపి ఎంపీలను కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజీనామాలు చేసి డ్రామాలు ఆడుతున్న చరిత్ర వైసీపీదేనని ఎద్దేవా చేశారు.

పార్లమెంట్లో టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 140 మంది దాకా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసేలా చేసిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడటం కోసంముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. వైసీపీ బంద్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా ప్రజలకు అసౌకర్యం కల్పిస్తోందని మంత్రి విమర్శించారు.
ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ దృష్టి ముఖ్యమంత్రి పదవి మీదేతప్ప రాష్ట్రం అభివృద్ది మీద లేదన్నారు. వాళ్లిద్దరికీ ప్రజల సమస్యలు పట్టవన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించేందుకు జగన్కు ధైర్యం లేదని పునరుద్ఘాటించారు. జగన్ బీజేపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం తన కేసుల నుంచి బయటపడడం కోసం ఆయన వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. టిడిపి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు.












Click it and Unblock the Notifications