పసుపు పండుగ సంబరాల వేళ.. హైఓల్టేజీ షాక్: టీడీపీ ఊహించి ఉండదేమో: ఓర్వలేకపోతోందంటూ
అమరావతి: తెలుగుదేశం పార్టీ వినూత్న తరహాలో డిజిటల్ మహానాడును నిర్వహిస్తోన్న వేళ రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యరీతిలో షాక్ ఇచ్చింది. ఈ కోణంలో ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురి చేస్తుందని బహుశా టీడీపీ నాయకులు కూడా ఊహించి ఉండరు. అందుకే- జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాము మహానాడును నిర్వహిస్తుండటాన్ని ప్రభుత్వం ఓర్వలేకపోతోందంటూ నిప్పులు చెరుగుతున్నారు. అధికార పార్టీ తమపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు.
దీనికంతటికీ కారణం- ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కరోనా నోటీసులను జారీ చేయడమే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, పెళ్లి మంటపాలు మూతపడ్డాయి. భారీగా జనం ఒకేచోట గుమికూడటాన్ని నివారించడానికి చివరికి దేవాలయాల్లో కూడా భక్తులను అనుమతి ఇవ్వడానికి అంగీకరించట్లేదు కేంద్ర ప్రభుత్వం. దీనికి అనుగుణంగా కట్టుదిట్టమైన మార్గదర్శకాలను రూపొందించింది కేంద్ర హో మంత్రిత్వ శాఖ.

ఇందులో పెద్ద ఎత్తున సడలింపులను ప్రకటించినప్పటికీ.. సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతి లేదు. అదే సమయంలో- కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘించేలా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మహానాడును నిర్వహిస్తోంది. 14 వేల మందితో ఆన్లైన్ రూపంలో రెండు రోజుల పాటు పసుపు పండుగను జరుపుకొంటోంది. ఆన్లైన్ ద్వారానే అయినప్పటికీ.. పార్టీ కేంద్ర కార్యాలయం దానికి ఎపిక్ సెంటర్గా మారడం వల్ల ప్రభుత్వం నోటీసులను జారీ చేసింది. కోవిడ్ నోటీసుల జారీచేసింది.
టీడీపీ కార్యాలయ కార్యదర్శి రమణ ఈ నోటీసులను అందుకున్నారు.
లాక్డౌన్ నియమాల ప్రకారంగా ఎటువంటి రాజకీయ సమావేశాలు, కార్యక్రమాలు గాని నిర్వహించకూడదని, అలాంటి సమయంలో చంద్రబాబు, ఆయన పార్టీ నిర్వహిస్తోన్న మహానాడును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదని, నియమాలు సామాన్యుడికి మాత్రమేనా? అంటూ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో ప్రభుత్వం ఈ మేరకు కోవిడ్ నోటీసులను అందజేసినట్లు చెబుతున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.
కరోనా ఉందన్న కారణంతోనే తాము మహానాడు సభలను ఏర్పాటు చేయలేదని, డిజిటల్ రూపంలో యాప్ ద్వారా మహా కార్యక్రమానికి పూనుకున్నామని అంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఓర్వలేకపోతోందని మండిపడుతున్నారు. మహానాడు సూపర్ సక్సెస్ అయిందనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని చెబుతున్నారు. మహానాడు విజయవంతం అవుతోందని, ప్రజలందరూ మహానాడును ఆసక్తిగా తిలకిస్తున్నారని అంటున్నారు. అందుకే- నిబంధనలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications