చంద్రబాబుకు తలనొప్పిగా టీడీపీలో ఆధిపత్యపోరు.. సిక్కోలు జిల్లాలో దిగ్గజనేతల సిగపట్లు
తెలుగుదేశం పార్టీలో అనేక జిల్లాలలో పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతోందా ? అసలే అధికారం పోయి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళ మధ్య కొనసాగుతున్న వర్గపోరు టిడిపికి నష్టం చేస్తుందా? రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితిని పట్టించుకోకుండా, ఎవరికివారు ఆధిపత్య పోరులో పక్క వారికి చెక్ పెట్టాలని చేస్తున్న ప్రయత్నం తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందికరంగా మారుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
అచ్చెన్నాయుడు వర్సెస్ కళా వెంకట్రావు
తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన సిక్కోలు జిల్లాలో టీడీపీ కీలక నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇద్దరూ జిల్లాలో రాజకీయంగా బలం ఉన్న నాయకులే కావడంతో జిల్లాలో పార్టీపై పట్టు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉందని టాక్ వినిపిస్తుంది.
ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు వున్నా ఇటీవల కాలంలో అది తారా స్థాయికి చేరిందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు నేతలు దిగ్గజ నాయకులే కావడంతో అటు చంద్రబాబు నాయుడు కూడా ఎవరికీ చెప్ప లేక తెగ సతమతమవుతున్నారు అని సమాచారం.
తన కనుసన్నల్లో జిల్లా రాజకీయాలు ఉండాలని నేతల వ్యూహం
జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడపాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారని టాక్. ఇక జిల్లాలో ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో పార్టీకి బాధ్యులుగా ఉన్న కళా వర్గానికి చెక్ పెట్టేందుకు అచ్చెన్న స్కెచ్ వేస్తున్నారట. ఈ నేపథ్యంలో కళావెంకట్రావు వర్గం అచ్చెన్నాయుడు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం, ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం, రాజాం నియోజకవర్గాలలో పార్టీకి బాధ్యులుగా ఉన్నవారికి అచ్చెన్నాయుడు ఎసరు పెడుతున్నాడని కళా వెంకట్రావు వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది.
కళా వర్గానికి అచ్చెన్న చెక్ పెట్టే యత్నం
ఒక్క రాజాం నియోజకవర్గం మినహాయించి మిగతా చోట్ల పార్టీకి బాధ్యులుగా ఉన్నవారంతా కళా వర్గానికి చెందిన వారని, అందుకే వారిని పక్కన పెట్టాలని అచ్చెన్నాయుడు చూస్తున్నట్లుగా సమాచారం. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో సమస్యలను పరిష్కరించాల్సిన అచ్చెన్నాయుడు, జిల్లాలో అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కలుపుకుపోవాల్సిన అచ్చెన్నాయుడు, సిక్కోలు జిల్లా పై ఆధిపత్యం కోసం జిల్లాలో సమస్యలు సృష్టిస్తున్నారని కళా వెంకట్రావు వర్గం ఆరోపిస్తోంది.
చంద్రబాబుకు తలనొప్పిగా కీలక నేతల ఆధిపత్యపోరు
రాష్ట్రంలో అధికారం లేక, అధికార పార్టీతో నిత్యం తల పడలేక, రోజుకో రకం సమస్యలతో, టిడిపి నేతలపై కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమస్యను పరిష్కరించడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి.ఇద్దరు నేతలు హేమాహేమీలే కావడంతో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా జిల్లాలో పరిస్థితి తయారైంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి అధినేత దృష్టి సారిస్తారు అన్న నమ్మకం కూడా తెలుగు తమ్ముళ్లలో కలగడం లేదు.
Recommended Video
అధికారంలో లేకున్నా ఆగని వర్గ విబేధాలు .. టీడీపీ నేతల తీరుతో అధినేతకు తిప్పలు
ఇప్పటికే చావుతప్పి కన్నులొట్టబోయినట్లుగా అధికారాన్ని పోగొట్టుకున్న టిడిపి నేతలు ఒకటిగా కలిసి ముందుకు సాగకుంటే భవిష్యత్తులో కూడా ఏపీలోని అనేక జిల్లాలలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అంతర్మధనానికి గురవుతున్నారు. ఏది ఏమైనా ఒక సిక్కోలు జిల్లా లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో తెలుగు తమ్ముళ్ళ మధ్య అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పడం నిర్వివాదాంశం.