మహానాడు: నిలదీస్తున్న పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందిందా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఇప్పటికే ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏటా ఏప్రల్ 27వ తేదీ నుండి మూడు రోజుల పాటు తెలుగుదేశం మహానాడును నిర్వహిస్తోంది.
గత ఏడాది హైదరాబాదులో మహానాడును నిర్వహించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. గత ఏడాది హైదరాబాదులో నిర్వహించినందున, ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ మహానాడుకు పవన్ను టీడీపీ ఇప్పటికే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు పలికారు. ఆ పార్టీల అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పటి నుండి రెండుమూడుసార్లు బయటకు వచ్చి ఏపీ ప్రభుత్వంపై రాజధాని విషయంలో ప్రశ్నించారు.
రైతుల భూములు బలవంతంగా తీసుకోవద్దని, ఇస్తే తీసుకోవచ్చునని ప్రభుత్వానికి సూచించారు. బలవంతంగా తీసుకుంటే తాను రైతుల తరఫున రోడ్డెక్కేందుకు కూడా సిద్ధమని చెప్పారు.
ఈ నేపథ్యంలో పవన్ను టీడీపీ ఆహ్వానించారని వార్తలు రావడం గమనార్హం. అయితే, ఆయన హాజరవుతారా లేదా అనేది చూడాలి. ఆయన మూడు రోజుల పాటు హాజరు కాకపోయినప్పటికీ ఎన్టీఆర్ జయంతి అయిన మే 28న హాజరయితే చాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారంటున్నారు.