ప్రథమ ద్రోహి చిరంజీవి: టిడిపి కాపు నేతల ధ్వజం
హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి సీమాంధ్రకు ప్రథమ ద్రోహి అని తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలు ధ్వజమెత్తారు. సీమాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు చిరంజీవికి లేదని వారు మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారని, కానీ హైదరాబాద్ కోసం కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలు కిమిడి కళా వెంకట్రావ్, నిమ్మకాయల చినరాజప్ప, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఈ మేరకు వారు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
సీమాంధ్రులు కోరుకునేది భవిష్యత్ తరాల కోసం, వారి విద్య కోసం, నీటి హక్కుల కోసం అంతేకానీ చిరంజీవిలాగా ఏ ఎండకా గొడుగు పట్టడం కాదని వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు చిరంజీవికి లేదని వారన్నారు. పిట్టల దొర కిరణ్కుమార్రెడ్డిని నమ్మి మోసం పోయామని చిరంజీవి చెబుతుంటే, చిరంజీవిని నమ్మి మోసపోయామని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారని వారు మండిపడ్డారు.
ఏ రోజు అయినా సీమాంధ్ర కోసం చిరంజీవి చేసింది ఏమైనా ఉందా అని వారు ప్రశ్నించారు. చిరంజీవి నమ్మిన ఆయన సామాజిక వర్గాన్ని, అభిమానులను, కార్యకర్తలను నట్టేట ముంచి, 16 మంది ఎమ్మెల్యేను కాంగ్రెసుకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే చిరంజీవి స్థానం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోవాలని వారు హెచ్చరించారు.
చంద్రబాబును విమర్శిస్తే, చిరంజీవికి ప్రజలే బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ధైర్యం ఉంటే చిరంజీవి తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, సీమాంధ్రలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వారన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబును తప్పు పడుతూ చిరంజీవి ప్రసంగించిన నేపథ్యంలో వారు ఈ ప్రకటన విడుదల చేశారు.