అది గెలుపు కాదు..వైసీపీ బలుపు: ఆ పేరు వింటే గన్నేరు పప్పుకు వణుకు: జగన్పై టీడీపీ ఫైర్
విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ప్రభంజనాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 73 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ సాధించిన విజయాన్ని తక్కువగా అంచనా వేస్తోంది. వైసీపీ సాధించిన గెలుపు.. గెలుపు కాదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విజయాన్ని వైసీపీ బలుపుగా తాము భావిస్తున్నామని చెబుతున్నారు.
ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచి ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలని సవాల్ విసురుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్య బద్ధంగా గెలవలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆ విజయాన్ని తాము లెక్కలోకి తీసుకోవట్లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వనియోగానికి పాల్పడిందని విమర్శించారు. నిజంగా తాము ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ ఎన్నికలను గెలిచామనే విశ్వాసం, దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డి తన 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని చెప్పారు. రాజీనామాలు చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మెడను వంచి విశాఖ ఉక్కు అమ్మకుండా అడ్డుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్ను గన్నేరు పప్పుతో పోల్చారు. గన్నేరు పప్పు అండ్ గబ్బు (విజయసాయిరెడ్డి)కి చిన్న సవాల్ అంటూ రాజీనామాల డిమాండ్ను వారి ముందుంచారు.
మోడీని చూసి వణుకుతూ వైఎస్ జగన్ తాడేపల్లి కొంపలో తొంగున్నాడని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను ఆయన ఎలాగూ అటకెక్కించాడని, కనీసం విశాఖ ఉక్కు కోసమైనా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలని అన్నారు. అప్పుడే వారి విజయం వెనుక ఉన్న వణుకు బయటపడుతుందని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. అన్ని మున్సిపాాలిటీలను గెలిచామంటూ కాలర్ ఎగరేసే జగన్ రాజీనామా అనగానే ఎందుకు పిరికివాడిలా ఇంటికే పరిమితమవుతున్నాడు నిలదీశారు.