బాబు భిక్ష వల్లే సోము వీర్రాజు ఎమ్మెల్సీ: 'కన్నా, పురంధేశ్వరి, కావూరిలు సోనియా ఏజెంట్లు'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భిక్ష వల్లే బీజేపీ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సోము వీర్రాజుపై బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి పదవి కోసమే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. సోదరి భువనేశ్వరి కుటుంబాన్ని చూసి ఓర్వలేకే పురంధేశ్వరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెంకన్న ధ్వజమెత్తారు.
కన్నా లక్ష్మీ నారాయణ, పురందేశ్వరి, కావూరి సాంబశివరావులు సోనియా గాంధీ ఏజెంట్లని... ఎన్నికల సమయానికి తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరతారని అన్నారు. వారాల ఇళ్లలో భోజనాలు చేసిన కావూరి వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఆస్తి ఎంత? ఇప్పుడు ఉన్న ఆస్తి ఎంత? అని నిలదీశారు.
బీజేపీ అగ్రనేతలు ఈ ముగ్గురిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. టీడీపీకి బీజేపీ మిత్రపక్షం కావడం వల్లనే బీజేపీ నేతలు ఎన్ని మాట్లాడినా తాము ఊరుకుండిపోతున్నామన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు చరిష్మా వల్లనే తాము అధికారంలోకి వచ్చామన్నారు. సీఎం చంద్రబాబుకు మచ్చ తెచ్చేలా మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత మంది బీజేపీ నేతలు వ్యతిరేకగళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం పట్ల ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తాజాగా మంగళవారం బీజేపీ నేత కావూరి సాంబశివరావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంలో అవినీతి లంచ గొండితనం పెరిగిపోతుందన్నారు. రోజురోజుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రజాభిమానాన్ని కోల్పోతుందన్నారు. ప్రభుత్వంలో పారదర్శకత లేకుండా అవినీతి పెరిగి విలువలు పడిపోతున్నాయన్నారు.